పేరుకే క్రీడా ప్రాంగణం!
ABN , Publish Date - Feb 25 , 2024 | 10:51 PM
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రాంగణాలతో పాటు క్రీడా పరికరాలు నిరుపయోగంగా మారాయి. గత ప్రభుత్వం పల్లెల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో పాటు ఆటలు ఆడుకునేందుకు ఆయా పంచాయతీలకు కిట్లను పంపిణీ చేసింది.
![పేరుకే క్రీడా ప్రాంగణం!](https://media.andhrajyothy.com/media/2024/20240224/25_BASHIRABAD_77_9413f617ee.jpg)
పిచ్చిమొక్కలు పెరిగి నిరుపయోగంగా మారిన వైనం
పంచాయతీలకే పరిమతమైన ఆట వస్తువులు
బషీరాబాద్, ఫిబ్రవరి 25: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రాంగణాలతో పాటు క్రీడా పరికరాలు నిరుపయోగంగా మారాయి. గత ప్రభుత్వం పల్లెల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో పాటు ఆటలు ఆడుకునేందుకు ఆయా పంచాయతీలకు కిట్లను పంపిణీ చేసింది. బషీరాబాద్ మండలంలో 36 గ్రామ పంచాయతీలకుగాను క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం కిట్లను ఇచ్చినా లక్ష్యం నేరవెరడం లేదు. పలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను అధికారులు, సిబ్బంది అనువుగాని ప్రదేశాల్లో ఏర్పాటు చేయడంతో ఆక్కరకు రాకుండా పోతున్నాయి. పలు గ్రామాల్లో పిచ్చమొక్కలు, చెట్లు, రాళ్లురప్పలు ఉన్న చోట ఏర్పాటు చేయడం గమనార్హం. మరికొన్ని చోట్ల గ్రామాలకు దూరంగా ఉండటంతో కూడా యువత ఆటువైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. కాంశీంపూర్ శివారులో క్రీడాప్రాంగణం పేరుకు మాత్రమే ఉందని, అంతా రాళ్లు పరుచుకోని ఉండటంతో ఎవరికి ఉపయోగమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీలకు వాలీబాల్ కిట్, క్రికెట్ కిట్, వ్యాయామలు చేసేందుకు డంబుల్స్, ఇతర పరికరాలను అందించినా ఎక్కడా కూడా వీటిని ఉపయోగిస్తున్న దాఖాలాలు లేవు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.