విద్యార్థి ప్రశాంత్ అంత్యక్రియలు పూర్తి
ABN , Publish Date - Apr 18 , 2024 | 04:18 AM
కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్
గాంధీ ఆస్పత్రి, స్వగ్రామంలో స్వల్ప ఉద్రిక్తత
భువనగిరి ‘గురుకులం’లో తల్లిదండ్రుల ఆందోళన
ప్రిన్సిపాల్ సస్పెన్షన్..
భువనగిరి టౌన్, ఏప్రిల్ 17: కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో పూర్తయ్యాయి. ఆస్పత్రి పాలైన 20 మందికిపైగా విద్యార్థులలో భూదాన్పోచంపల్లి మండలం జిబ్లక్పల్లికి చెందిన ఆరో తరగతి విద్యార్థి చినలచ్చి ప్రశాంత్(12) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గాంధీ ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. కలుషిత ఆహారం ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ప్రశాంత్ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి సముదాయించడంతో వారు పోస్టుమార్టంకు అంగీకరించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ప్రశాంత్ మృతదేహాన్ని జిబ్లక్పల్లికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలోనూ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
విద్యార్థి ప్రశాంత్ మృతి సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భువనగిరిలోని గురుకుల పాఠశాలకు పెద్ద సంఖ్యలో చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. వారితోపాటు ఎస్ఎ్ఫఐ, బీజేపీ ఎస్సీ మోర్చ నాయకులు కూడా ఆందోళన చేశారు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. కాగా విద్యార్థి మృతితో గురుకుల అధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాలలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. తరగతి గదులు, డార్మెటరీ, వంటశాలతోపాటు పరిసరాలను శుభ్రం చేశారు. ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ శ్రీరాం శ్రీనివా్సను సస్పెండ్ చేసి, వైస్ ప్రిన్సిపాల్ రాముకు బాధ్యతలను అప్పగించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం కొనసాగుతోంది. వేసవి సెలవుల ప్రారంభమయ్యే వరకు(ఈనెల 24) వైద్య శిబిరం కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే వార్షిక పరీక్షల షెడ్యూల్ను కుదించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి 15వ తేదీన పరీక్షలు ప్రారంభమై 24తో ముగియనుండగా.. గడువులోపే పరీక్షలను పూర్తిచేసి, విద్యార్థులను ఇంటికి పంపించేందుకు స్థానిక అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదిస్తున్నారు.
ఇది ప్రభుత్వ హత్యే: ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): భువనగిరి ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి ప్రభుత్వ హత్యే అని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆహారం విషతుల్యమై విద్యార్థి మృతి చెందిన ఘటనపై ఆయన బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. గురుకుల పాఠశాలల్లో క్షేత్రస్థాయి నియంత్రణ లోపించిందని, కొంచం వ్యవస్థను చక్కదిద్దండి అని ఎన్నిసార్లు బహిరంగంగా వేడుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ గుండె కరగలేదన్నారు.