ప్రయాణ సౌకర్యం కోసమే ర్యాంపుల నిర్మాణం
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:41 AM
యాదగిరిగుట్ట పట్టణంలోని గాంధీనగర్ నుంచి యాదగిరిపల్లి వరకు ఉన్నపెద్ద రోడ్డు నుంచి ప్రజల ప్రయాణానికి సౌకర్యంగా ఉండేందుకు ర్యాంపుల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు.
![ప్రయాణ సౌకర్యం కోసమే ర్యాంపుల నిర్మాణం](https://media.andhrajyothy.com/media/2023/20231205/7_YDR_1_7dc0f0f9d7.jpg)
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 7: యాదగిరిగుట్ట పట్టణంలోని గాంధీనగర్ నుంచి యాదగిరిపల్లి వరకు ఉన్నపెద్ద రోడ్డు నుంచి ప్రజల ప్రయాణానికి సౌకర్యంగా ఉండేందుకు ర్యాంపుల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. పట్టణంలోని గాంధీనగర్లో ర్యాంపుల నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రోడ్డు నిర్మించడంతో స్థానికులు, వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూడు ర్యాంపుల నిర్మాణంతో గాంధీనగర్, యాదగిరిపల్లి, బీసీకాలనీ, వంగపల్లి, మల్లాపురం వెళ్లే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా ర్యాంపులతో రోడ్డు దిగి వెళ్లేందుకు అనువుగా ఉంటుందని తెలిపారు. యాదగిరిగుట్టలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని. అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త నిర్మా ణ వ్యాపార సముదాయాలను పరిశీలించారు. గాంధీనగర్ నుంచి యాదగిరిపల్లి వరకు గుంతలమయమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు కౌన్సిలర్ గౌళీకార్ అరుణా రాజేష్, స్థానికులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, వైస్ చైర్మన్ కాటం రాజు, కౌన్సిలర్లు గౌళీకార్ అరుణారాజేష్, సీస విజయలక్ష్మి కృష్ణ, ముక్కెర్ల మల్లేశ్, బిట్టు హరీష్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగుబాల్రాజ్గౌడ్, గుండ్లపల్లి భరత్గౌడ్ పాల్గొన్నారు.