ఇసుక జారడం వల్లే బ్యారేజీ కుంగింది
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:44 AM
పిల్లర్ల పునాదుల్లో(రాఫ్ట్ సీకెంట్ పైల్) ఉన్న ఇసుకంతా జారి పోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిందని ఈఆర్టీ(ఎలకో్ట్ర రెసెస్టివిటీ టెస్ట్) పరీక్షలో తేలింది. ఎక్కువ రోజులు భారీగా నీటిని

మేడిగడ్డ ఏడో బ్లాక్పై ఈఆర్టీ నివేదిక ఇచ్చిన ఎల్ అండ్ టీ
ఇసుక జారడం వల్లే బ్యారేజీ కుంగింది
హైదరాబాద్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): పిల్లర్ల పునాదుల్లో(రాఫ్ట్ సీకెంట్ పైల్) ఉన్న ఇసుకంతా జారి పోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిందని ఈఆర్టీ(ఎలకో్ట్ర రెసెస్టివిటీ టెస్ట్) పరీక్షలో తేలింది. ఎక్కువ రోజులు భారీగా నీటిని నిల్వ చేయడం వల్ల బ్యారేజీపై ఒత్తిడి పెరిగి అది పునాదుల మధ్య ఇసుక జారేలా చేసిందని ఆ పరీక్షలో గుర్తించారు. బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ జనవరి 4-9 తేదీల్లో మేడిగడ్డలో ఈఆర్టీ చేపట్టింది. ఇందుకు సంబంధించిన నివేదికను తాజాగా నీటి పారుదల శాఖకు అందించింది. ఏడో బ్లాకు కింది నుంచి ఇసుక జారడమే బ్యారేజీ కుంగుబాటుకు కారణమని అందులో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకులోని 19, 20, 21 పిల్లర్లు గతేడాది అక్టోబరు 21న కుంగిపోయాయి. బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ఆ సమయంలో 10.33 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ నిల్వల వల్లే బ్యారేజీపై ఒత్తిడి పెరిగి ప్రమాదం జరిగి ఉంటుందని గుర్తించారు. నిజానికి, 2019 జూన్లో మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. ఆ ఏడాది నవంబరులో వచ్చిన వరదల అనంతరం గేట్లను దించారు. ఈ క్రమంలో కాంక్రీట్ బ్లాకులు చెల్లాచెదురు కావడంతోపాటు డౌన్స్ట్రీమ్, అప్స్ట్రీమ్ అఫ్రాన్లు దెబ్బతిన్నాయి. దీంతో వరద తీవ్రతను తట్టుకునే విధంగా బ్యారేజీ డిజైన్ లేదని అప్పట్లోనే అధికారులు గుర్తించారు. అప్పట్లోనే మరమ్మతులు లేదా పునరుద్ధరణకు ఉపక్రమించి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొన్నారు.