ఏడుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:55 AM
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్థాపంతో ఆరుగురు విద్యార్థులు, ఫెయిల్ అవుతానన్న భయంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. మంచిర్యాల, ఖమ్మం, హైదరాబాద్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్థాపంతో ఆరుగురు విద్యార్థులు, ఫెయిల్ అవుతానన్న భయంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. మంచిర్యాల, ఖమ్మం, హైదరాబాద్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచలాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్ (18), నస్పూర్ పరిధిలోని దొరగారిపల్లెకు చెందిన గటిక తేజస్విని(18), ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామానికి చెందిన వైశాలి(17), మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిల్కోడుకు చెందిన భార్గవి(17), హైదరాబాద్ నగరం హైదర్గూడ శివానగర్కు చెందిన హరిణి ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. బుధవారం ఫలితాలు వెలువడగా ఈ ఆరుగురూ ఫెయిల్ అయ్యారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వీరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఘటనలో మహబూబాబాద్ జిల్లా రెడ్యాలకు చెందిన అశ్విని(17) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా, సిద్దిపేట జిల్లా మర్కుర్ మండలం పాతూరుకు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఈరన్న శ్రీజ(17) ఫెయిల్ అవుతానన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. తీరా చూస్తే ఫలితాలు వెలువడిన అనంతరం ఆమె 401 మార్కులతో పాస్ అయింది. బుధవారం ఉదయం ఫలితాలు వెలువడగా.. శ్రీజ అంతకు ముందే అర్ధరాత్రి ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో పురుగుల మందు తాగింది.