శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేసేస్తున్నారు!
ABN , Publish Date - Sep 25 , 2024 | 04:17 AM
జలాశయాల్లో నీటిని తొలుత తాగునీటికి, ఆ తర్వాతే సాగునీటికి, చివరిలో జల విద్యుత్ ఉత్పాదనకు వినియోగించాలనేది నిబంధన. అయితే వరదలు తగ్గి.. ఇన్ఫ్లో లేనప్పటికీ తెలుగు రాష్ట్రాలు పోటీపడి
ఇన్ఫ్లో అంతంతమాత్రమే
పోటాపోటీగా తెలంగాణ, ఏపీ
జల విద్యుత్ ఉత్పత్తి 3 వారాల్లో 52.61 టీఎంసీల తరుగుదల
ఇన్ఫ్లో అంతంతమాత్రంగా ఉన్నా
పోటాపోటీగా జల విద్యుత్ ఉత్పత్తి
తెలంగాణ, ఏపీ వైఖరితో 3 వారాల్లో 52.61 టీఎంసీల తరుగుదల
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జలాశయాల్లో నీటిని తొలుత తాగునీటికి, ఆ తర్వాతే సాగునీటికి, చివరిలో జల విద్యుత్ ఉత్పాదనకు వినియోగించాలనేది నిబంధన. అయితే వరదలు తగ్గి.. ఇన్ఫ్లో లేనప్పటికీ తెలుగు రాష్ట్రాలు పోటీపడి శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేస్తున్నాయి. జల విద్యుత్ ఉత్పత్తి, పోతిరెడ్డిపాడు నుంచి భారీగా నీటి తరలింపుతో జలాశయం వేగంగా ఖాళీ అవుతోంది. ఈ నెల 9న 206.10 టీఎంసీల నీటి నిల్వ ఉండగా... మంగళవారం ఉదయం 163.2 టీఎంసీలు మాత్రమే ఉంది. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా మూడు వారాల్లో 52.61 టీఎంసీలను ఖాళీ చేసేశారు. నవంబరు దాకా ప్రాజెక్టులకు వరద ప్రవాహం ఉంటుందని సమాచారం ఉన్నా... కచ్చితంగా వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఎగువన ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద పోటెత్తితేనే దిగువన ఉన్న శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పాదనకు వినియోగించుకోవాలి. ఆల్మట్టి నుంచి కేవలం 12 వేల క్యూసెక్కులు, ఆ దిగువన ఉన్న నారాయణపూర్ నుంచి 14,307 క్యూసెక్కుల ఔట్ ఫ్లో మాత్రమే ఉంది. జూరాల నుంచి 18,355 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉన్నా ఒక్కచుక్క కూడా శ్రీశైలం జలాశయంలోకి చేరకుండానే మళ్లిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క చుక్క కూడా రావడం లేదని ఆంధ్రప్రదేశ్ జలవ నరుల సమాచార వెబ్సైట్లో గణాంకాలు చూపిస్తుండటం గమనార్హం. వచ్చిన ఇన్ఫ్లోను వచ్చినట్లే పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి నుంచి మళ్లిస్తుండటం గమనార్హం. భారీగా ఇన్ఫ్లో ఉన్న సమయంలో జల విద్యుత్ ఉత్పత్తి చేయాలి. కానీ ఇన్ఫ్లో అంతంతమాత్రంగా ఉన్నప్పుడు పోటీపడి జల విద్యుత్ ఉత్పత్తి చేయడం విమర్శలకు తావిస్తోంది. శ్రీశైలం కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి ఏపీ ఇప్పటిదాకా 766.41 మిలియన్ యూనిట్లు, ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ ఇప్పటిదాకా 1,057 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసింది. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 52 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం నుంచి సాగర్కు 44 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వచ్చింది వచ్చినట్టే దిగువకు వదిలిపెట్టారు. ఆ దిగువన ఉన్న పులిచింతలకు 37 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 36 వేల క్యూసెక్కులు వదిలిపెట్టారు. దాంతో ప్రకాశం బ్యారేజీ నుంచి మంగళవారం 43 వేల క్యూసెక్కులు సముద్రం దిశగా వెళ్లిపోయాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించి.. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలను పెంచుకోవాలని రైతులు కోరుతున్నారు.