ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - Mar 01 , 2024 | 04:35 AM
ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం శుక్రవారం నుంచి ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. ఈ క్రమంలో తహసీల్దార్, ఆర్డీవోలకు కూడా పలు అధికారాలను దఖలుపరిచింది. వారం క్రితం ఈ
నేటి నుంచి 9 వరకుపెండింగ్ దరఖాస్తుల పరిష్కారం
ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలు
తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్లకు అధికారాల బదిలీ
మార్గదర్శకాలు జారీచేసిన సీసీఎల్ఏ నవీన్మిత్తల్
ధరణిలో లక్షల ఎకరాలు మాయం..!
ఆ పోర్టల్ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం
ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం: పొంగులేటి
హైదరాబాద్, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం శుక్రవారం నుంచి ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. ఈ క్రమంలో తహసీల్దార్, ఆర్డీవోలకు కూడా పలు అధికారాలను దఖలుపరిచింది. వారం క్రితం ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి, ఉన్నతాధికారులతో ధరణి కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని ఆ సమావేశం తీర్మానించింది. దీంతో సీసీఎల్ఏ నవీన్మిత్తల్ గురువారం ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేలా ఉత్తర్వులను జారీచేశారు. ఈనెల 9లోగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి, మండలాల వారీగా దరఖాస్తులను పరిష్కరించాలని ఆయన ఆ ఉత్తర్వుల్లో నిర్దేశించారు. ప్రతి మండలానికి రెండు-మూడు బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసే బృందానికి తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు నేతృత్వం వహించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే రెవెన్యూ సిబ్బంది, అవసరాన్ని బట్టి ఇతర శాఖల సిబ్బందిని ఈ బృందాల్లో నియమించాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్లలో ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్లు ఏరోజుకారోజు ఆర్డీవోలు, తహసీల్దార్ల ద్వారా పురోగతిని తెలుసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ధరణిలో దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణల అధికారం కేవలం కలెక్టర్లకే ఉండేది. నవీన్మిత్తల్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో ఆ అధికారాలను ఆర్డీవోలు, తహసీల్దార్లకు కూడా దఖలుపరుస్తున్నట్లు స్పష్టంచేశారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్.. ఇలా ఏయే అధికారి స్థాయిలో ఎలాంటి సమస్యలను పరిష్కరించాలో వివరంగా పేర్కొన్నారు. అన్ని స్థాయుల్లో పరిశీలన జరిపేలా కలెక్టర్లకు విచక్షణాధికారాలను ఇచ్చారు. దరఖాస్తుదారుడి భూమి విలువ రూ.5 లక్షల్లోపు ఉంటే ఆర్డీవో.. రూ.5లక్షల నుంచి రూ.50 లక్షల్లోపు ఉంటే కలెక్టర్లు, రూ.50 లక్షలకు పైన ఉంటే సీసీఎల్ఏ ఆ దరఖాస్తులను పరిష్కరిస్తారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఒక దరఖాస్తును ఆమోదించినా.. తిరస్కరించినా.. అందుకు కారణాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది. కాలయాపన లేకుండా.. అధికారులకు స్పష్టమైన గడువును విధించారు. అంటే.. తహసీల్దార్ ఏడు రోజులు, ఆర్డీవో 3 రోజులు, అదనపు కలెక్టర్ 3 రోజులు, కలెక్టర్ ఏడు రోజుల్లో ఆయా దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుంది.
తహసీల్దార్ అధికారాలివి..!
అసైన్డ్ భూములు సహా టెక్నికల్ మాడ్యుల్(టీఎం)-4 పరిధిలోని విరాసత్ దరఖాస్తులను తహసీల్దార్ పరిష్కరిస్తారు. టీఎం-10 దరఖాస్తులు-- జీపీఏ, ఎస్పీఏ, ఎగ్జిక్యూటివ్ జీపీఏలు, టీఎం-14లోని స్పెషల్ ల్యాండ్ మ్యాటర్, టీఎం-32లోని మెర్జింగ్కు సంబంధించిన అర్జీలకు తహసీల్దార్ పరిధిలోనే పరిష్కారం లభిస్తుంది. ఇందుకోసం తహసీల్దార్లు సెత్వార్, చేసాలా, పాత పహాణీలు, ఖాస్రా పహాణీలు, ఇతర రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తారు.
ఆర్డీవో పరిధిలోకి వచ్చేవి ఇవే..!
టీఎం-7లో దరఖాస్తు చేసుకున్న నాలా కన్వర్షన్, టీఎం-16 పరిధిలోకి వచ్చే ప్రభుత్వం సేకరించిన భూముల సమస్యలు, టీఎ-20 లోని ఎన్నారైల భూములకు సంబంధించిన సమస్యలు, టీఎం-22లోని సంస్థలకు సంబంధించిన పట్టాదారు పాస్పుస్తకాల జారీ, టీఎం-26 పరిధిలోని కోర్టు కేసులకు సంబంధించిన సమస్యలను ఆర్డీవోలు పరిశీలించి, పరిష్కరిస్తారు. వీటితోపాటు.. టీఎం-33 పరిధిలోని భూ సమస్యల(మార్కెట్ విలువ రూ.5 లక్షల లోపు) దరఖాస్తులను ఆర్డీవోలు పరిశీలించనున్నారు.
కలెక్టర్ల పరిధిలో అధికారాలు..
అన్ని మాడ్యూళ్ల దరఖాస్తులను రిపోర్టుల ఆధారంగా ఆమోదించే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. మ్యుటేషన్, సక్సెషన్, పీవోబీ సమస్యలు, సెమీ అర్భన్ ఏరియాలో పట్టాదారు పాస్పుస్తకాల సమస్యలు, కోర్టు తీర్పుల ఆధారంగా పాసుపుస్తకాల జారీ, ఇళ్లు లేదా నివాస స్థలాలుగా మారిన భూముల నాలా కన్వర్షన్, టీఎం-33 పరిధిలో.. పాసుబుక్ డేటా కరెక్షన్లో పేరు మార్పు, ధరణి రాకముందే అమ్మేసిన భూముల సమస్యలు పరిష్కరిస్తారు. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు విలువ కలిగిన భూముల సమస్యలు పరిష్కరించే అధికారం కలెక్టర్లకు ఉంటుంది.
సీసీఎల్ఏ పరిష్కరించేవి..
టీఎం-33 కింద వచ్చిన దరఖాస్తులు డేటా కరెక్షన్, నోషనల్ ఖాతా, ట్రాన్స్ఫర్, క్లాసిఫికేషన్ మార్పుతోపాటు.. రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువ చేసే భూముల డేటా కరెక్షన్ సంబంధించిన అర్జీలను, సీసీఎల్ఏ పరిశీలించి, పరిష్కరిస్తారు.
శ్వేతపత్రం విడుదల చేస్తాం: మంత్రి పొంగులేటి
ధరణిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి వెల్లడించారు. ధరణితో రెవెన్యూ వ్యవస్థను కొల్లగొట్టారంటూ గత సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి వల్ల ఎన్నో రైతు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, లక్షల ఎకరాలను మాయం చేశారని ఆరోపించారు. గత సర్కారు తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామన్నారు. ఈ నెల 9 వరకు నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్ల వల్ల ప్రజలు తమ విలువైన భూములను దక్కించుకుంటారని వ్యాఖ్యానించారు. భూరికార్డుల పాలిట శరాఘాతంగా ఉన్న ధరణి పోర్టల్ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు.