ముదిరాజ్లకు సొసైటీలో సభ్యత్వం ఇవ్వండి
ABN , Publish Date - Apr 06 , 2024 | 03:46 AM
ప్రాథమిక మత్స్యకార సహకార సొసైటీలో ముదిరాజ్ కులస్థులకు సభ్యత్వం ఇవ్వాలని హైకోర్టు మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది
![ముదిరాజ్లకు సొసైటీలో సభ్యత్వం ఇవ్వండి](https://media.andhrajyothy.com/media/2024/20240326/Untitled_2_3ec265f7b7.jpg)
హైకోర్టు ఆదేశం
ప్రాథమిక మత్స్యకార సహకార సొసైటీలో ముదిరాజ్ కులస్థులకు సభ్యత్వం ఇవ్వాలని హైకోర్టు మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్లు సరైన నమూనాలో దరఖాస్తు చేయాలని, ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని చట్టప్రకారం మూడువారాల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం ఖాజీపూర్ ప్రైమరీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఆ గ్రామంలో 40 మంది ముదిరాజ్ కులస్థులకు సభ్యత్వం ఇవ్వడంలేదని పేర్కొంటూ ముదిరాజ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి. గణేశ్, పి. భూపతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది డీఎల్ పాండు వాదనలు వినిపిస్తూ.. మత్స్యకార కులాల్లో ఒకటిగా ఉన్న ముదిరాజ్లకు సభ్యత్వం ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సరైన నమూనాలో దరఖాస్తులు సమర్పిస్తే చట్టప్రకారం పరిశీలిస్తామని పేర్కొన్నారు.