శాస్త్రోక్తంగా నిత్య పూజలు
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:37 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో నిత్య కైంకర్యాలు పాంచారాత్రగమశాస్త్ర రీతిలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

భువనగిరి అర్బన్, జూలై 4: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో నిత్య కైంకర్యాలు పాంచారాత్రగమశాస్త్ర రీతిలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రభాతవేళ సుప్రభాతంతో స్వామిఅమ్మవార్లను మేల్కొలిపి అర్చకస్వాములు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టామూర్తులను వేదమంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకించి తులసీ దళాలతో సహస్రనామార్చన జరిపారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో స్వామి అమ్మవార్లను ముగ్ధమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజవాహన సేవలో ఊరేగించి విశ్వక్సేనుడి తొలిపూజలతో నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమశాస్త్రరీతిలో చేపట్టారు. సాయంత్రం ప్రధానాలయ ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో నిత్య కైంకర్యాలు వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ వైభవంగా జరిపారు. కొండపైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామికి రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.19,12,316 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు.