Share News

హెచ్‌పీఎ్‌స మాకెన్నో జ్ఞాపకాలను ఇచ్చింది!

ABN , Publish Date - Dec 25 , 2024 | 05:27 AM

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎ్‌స)లో చేరిన రోజును ఇప్పటికీ మరిచిపోలేదు. బస్సెక్కి స్కూల్‌కు రావడం,

హెచ్‌పీఎ్‌స మాకెన్నో జ్ఞాపకాలను ఇచ్చింది!

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌

శతాబ్ది ఉత్సవాల్లో ‘ఫ్లైట్‌ ఆఫ్‌ ది ఈగల్‌’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎ్‌స)లో చేరిన రోజును ఇప్పటికీ మరిచిపోలేదు. బస్సెక్కి స్కూల్‌కు రావడం, స్నేహితులను కలవడం నుంచి ఎన్నో తీపిగుర్తులు ఇక్కడ ఉన్నాయ’ని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. తన మీద తనకు విశ్వాసం కలిగించింది ఈ పాఠశాలేనని చెప్పారు. తాను ఏడో తరగతిలో హెచ్‌పీఎ్‌సలో చేరానని, తన తండ్రికి తరచు బదిలీలతో వేర్వేరు నగరాలకు తిరిగినా, హైదరాబాద్‌లోనే కాస్త స్థిరంగా ఉన్నామని గుర్తుచేసుకున్నారు. తన పదో తరగతి తరువాత తన తండ్రికి మళ్లీ బదిలీ అయిందని, తమతో పాటు రావాల్సిందేని ఆయన అన్నా తాను మాత్రం పట్టుబట్టి ఇక్కడే హాస్టల్‌లో ఉండి చదివానని చెప్పారు. బేగంపేటలోని హెచ్‌పీఎ్‌స శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘ప్లైట్‌ ఆఫ్‌ ద ఈగల్‌’ పుస్తకాన్ని మంగళవారం ఆ పాఠవాల పూర్వ విద్యార్థులు సత్య నాదెళ్ల, అడోబ్‌, సీఈఓ శంతను నారాయణ్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ ఓ విద్యా సంస్థ 101 సంవత్సరాలుగా నిలిచి ఉండటమే కాకుండా కాలానికి అనుగుణంగా మారుతూ ఎంతోమందిని తీర్చిదిద్దుతున్న తీరు స్ఫూర్తిదాయకమని చెప్పారు. చదువంటే గణితం లేదా కొన్ని నైపుణ్యాలు నేర్పడం మాత్రమే కాదని, విద్యార్థులు ఉన్నతాశయాలు ఏర్పరుచుకునేలా శక్తి సామర్థ్యాలు ఇవ్వడం, వారి కలలకు రెక్కలు తొడిగి సాకారమయ్యేలా తీర్చిదిద్దడమని పేర్కొన్నారు. శంతను నారాయణ్‌ మాట్లాడుతూ తాను ఈ స్కూల్‌లో చాలా సంవత్సరాలు క్రీడా వార్తలు చదివానని, టెన్నిస్‌ ఆడేవాడినని, డిబేట్‌, లీడర్‌షిప్‌ జట్లలో ఉండేవాడినని, గుర్తుచేసుకున్నారు.

ఈ స్కూల్‌కు సత్య నాదెళ్ల చేసిన సేవ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ పుస్తకంతో వందేళ్ల హెచ్‌పీఎ్‌స చరిత్ర, విజయాలు మాత్రమే కాకుండా తోడ్పాటునందించిన వ్యక్తులు, స్ఫూర్తి ప్రదాతలను పరిచయం చేశామని పుస్తక చీఫ్‌ ఎడిటర్‌ కిశోర్‌ కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీఎ్‌స ప్రిన్సిపాల్‌ స్కంద్‌ బాలీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ అమృత చంద్రరాజు, హెచ్‌పీఎ్‌స సొసైటీ అధ్యక్షుడు గుస్తీ జెనోరియా, ఉపాధ్యక్షుడు ఫయాజ్‌ఖాన్‌, కందూర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, సంజీవ్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 05:27 AM