ప్రసాద తయారి సిబ్బంది ‘వేతన’ వివాదం
ABN , Publish Date - Oct 27 , 2024 | 01:02 AM
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రసాదాల తయారీలో పని చేసే సిబ్బంది వేతనాల పెంపు వివాదం వారి విధుల నుంచి తొలగింపునకు దారి తీసింది.
ఫ కోర్టును ఆశ్రయించిన కొండగట్టు సిబ్బంది
ఫ అవసరం మేరకే సిబ్బంది వినియోగం
ఫ ధిక్కార కేసు వెనక్కి తీసుకోవాలన్న అధికారులు
మల్యాల, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రసాదాల తయారీలో పని చేసే సిబ్బంది వేతనాల పెంపు వివాదం వారి విధుల నుంచి తొలగింపునకు దారి తీసింది. దేవస్థానం పరిధిలో భక్తుల కోసం నిత్యం లడ్డూ, పులిహోర, సిరా ప్రసాదం అందుబాటులో ఉంటుండగా వాటి తయారీ కోసం 14మంది వేతన సిబ్బందితో పాటు కూలి వేతనంపై మరి కొందరు పని చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సిబ్బంది కోర్టును ఆశ్రయించి తమ వేతనాలను పెంచుకున్నారు. ఇటీవల మళ్లీ తమకు కనీస వేతనాలు అందించాలని, శాశ్వత ప్రాతిపదికన గుర్తించాలని కోర్టుకు వెళ్లారు. కనీస వేతనాలపై నివేదిక ఇవ్వాలనే కోర్టు ఆదేశాలపై స్పందించకపోవడంపై సిబ్బంది కోర్టు ధిక్కారం కింద దేవాదాయ శాఖ అధికారులపై మరోసారి న్యాయస్థానానికి వెళ్లారు. శనివారం ఈవో రామకృష్ణరావును కలిశారు. అయితే కనీస వేతనాలు, శాశ్వత ప్రతిపాదికన నియామకం అనేది దేవాదాయశాఖ పరిధిలోకి వస్తుందని దిక్కారం కేసు వెనక్కి తీసుకోవాలని సూచించారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాల్సిందేనని సిబ్బంది కోరారు. ప్రసాద తయారీలో పరిమితికి మించి సిబ్బంది ఉన్నారని తాము అవసరం ఉన్న వరకే సిబ్బందిని తీసుకుంటామని మిగితా సిబ్బంది ఆదివారం నుంచి పనులకు రావద్దని దేవస్థానం అధికారులు తేల్చి చెప్పారు. విధులకు వచ్చినా తీసుకోవద్దని అక్కడి సిబ్బందిని ఆదేశించారు