అమెరికాలో రోడ్డు ప్రమాదం..
ABN , Publish Date - Apr 22 , 2024 | 04:59 AM
అమెరికాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముక్క నివేష్(19), పార్శి గౌతమ్ (19) అనే యువకులు మరణించారు. నివేష్ స్వస్థలం కరీంనగర్ జిల్లా
ఇద్దరు తెలంగాణ యువకుల మృతి
హుజూరాబాద్, స్టేషన్ఘన్పూర్, ఏప్రిల్ 21: అమెరికాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముక్క నివేష్(19), పార్శి గౌతమ్ (19) అనే యువకులు మరణించారు. నివేష్ స్వస్థలం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కాగా గౌతమ్ సొంతూరు జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ పరిధి శివునిపుల్లి. నివేష్, గౌతమ్ ఇంటర్ పూర్తి చేసిన తర్వాత బీటెక్ చదివేందుకు ఏడాదిన్నర క్రితం అమెరికాలోని అరిజోనా వెళ్లారు. ఇరువురు ప్రస్తుతం బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. నివేష్, గౌతమ్ మరికొందరు స్నేహితులు కలిసి శనివారం(అమెరికా కాలమాన ప్రకారం) స్థానికంగా ఓ జలపాతం సందర్శనకు కారులో వెళ్లారు. అక్కడి నుంచి అరిజోనాలోని ఇంటికి తిరిగి వస్తుండగా వీరి ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి మరో కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు వెనక సీట్లో కూర్చోని ఉన్న నివేష్, గౌతమ్ అక్కడికక్కడే మరణించారు. అరిజోనా పోలీసులు బాధిత కుటుంబసభ్యులకు ఈ ప్రమాదంపై సమాచారం ఇచ్చారు. నివేష్, గౌతమ్ మృతదేహాలు స్వస్థలానికి చేరుకునేందుకు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.