KTR : కేసీఆర్ కాలిగోటికీ రేవంత్ సరిపోడు
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:07 AM
‘‘కేసీఆర్ను తొక్కుతాం.. బొంద పెడతాం.. గులాబీ జెండాను కనబడకుండా చేస్తాం అంటూ మాట్లాడిన పెద్ద పెద్ద తీస్మార్ఖాన్లతోనే ఏమీ కాలేదు.
తీస్మార్ఖాన్లతోనే ఏమీకాలేదు
బుడ్డర్ఖాన్తో ఏమవుతుంది?
50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు
విపక్షంలోనే కేసీఆర్ డేంజర్
బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్కు లేదు
సిరిసిల్లను వదిలి వెళ్లను..
వదంతులను నమ్మొద్దు: కేటీఆర్
సిరిసిల్ల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్ను తొక్కుతాం.. బొంద పెడతాం.. గులాబీ జెండాను కనబడకుండా చేస్తాం అంటూ మాట్లాడిన పెద్ద పెద్ద తీస్మార్ఖాన్లతోనే ఏమీ కాలేదు. రేవంత్రెడ్డి లాంటి బుడ్డర్ఖాన్లతో ఏమవుతుంది?. పిచ్చిమాటలు, ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయన గురువు కూడా గతంలో ఇలాగే మాట్లాడాడు. బీఆర్ఎ్సను వంద మీటర్లు తొక్కి వేయాలని.. మూడు ఫీట్లు లేని రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎన్నటికీ కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్రెడ్డి సరిపోడు. కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదువులు వచ్చేవా?’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో ఆదివారం బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి లాంటి వాళ్లు వస్తారు.. పోతారన్నారు. వాళ్లకు కాలం కలిసొచ్చి తంతే గారెల బుట్టలో పడ్డారని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో మాణిక్కమ్ ఠాగూర్ను మేనేజ్ చేసి రూ. 50 కోట్లు ఇచ్చి, నలుగురిని పోగేసుకుని పదవి తెచ్చుకున్నాడని ఆరోపించారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని, వంద రోజులు ఓపిక పట్టాలని కేసీఆర్ చెప్పారని తెలిపారు. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని, ప్రభుత్వానికి సహహకరిస్తామని, తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రజలపక్షాన నిలబడుతామని చెప్పామన్నారు. రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలకు సర్వదా రుణపడి ఉంటామన్నారు. కొత్తగా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని, దానిలో రాణిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కంటే ప్రతిపక్షంలోనే డేంజర్ అని, ప్రజలపక్షాన చీల్చి చెండాడడంలో, ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు భారతదేశంలో ఎక్కడా లేదని కేటీఆర్ చెప్పారు.
పోయింది అధికారం మాత్రమే.. పోరాట పటిమకాదు
రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించామని దావోస్లో ఉన్నప్పుడు రేవంత్ చెప్పారని, విదేశాల్లో పచ్చి బోగస్ మాటలు మాట్లాడాడని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధుకే ఇప్పటివరకు దిక్కులేదన్నారు. కేసీఆర్ను నాలుగు తిట్లు తిట్టి ప్రజల దృష్టిని మళ్లించి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. సిరిసిల్లలో నేతన్నలను కాపాడుకుంటామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ లేని నాడే తెలంగాణ తెచ్చామని, గులాబీ జెండా పెద్ద వాళ్లను తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు. పోయింది అధికారం మాత్రమేనని.. పోరాట పటిమ కాదని, సత్తా తగ్గలేదని కేటీఆర్ అన్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ విఫలమయ్యారని ఆరోపించారు. లోక్సభలో ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదని, ఒక్క బిల్లు పెట్టలేదని విమర్శించారు. దేవుడి పేరిట ఓట్లు అడగడమే ఆయనకు తెలుసన్నారు. రాహూల్ గాంధీ భారత్ జోడో అంటే దేశమంతా ‘కాంగ్రెస్ చోడో’ అంటోందని, బీజేపీని నిలువరించడం కాంగ్రె్సతో సాధ్యం కాదని చెప్పారు. బీజేపీని ఆపే సత్తా బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్, మమతా బెనర్జీ లాంటి వాళ్లకే ఉందన్నారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోతున్నాడని వదంతులు పుడుతున్నాయని, ఎవరూ నమ్మవద్దని, తనకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల అని.. రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ ఇక్కడే ఉంటానని, ఎక్కడికీ వెళ్లనని ఆయన స్పష్టం చేశారు.
ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వాళ్లు కూడా అనుకోలేదని కేటీఆర్ అన్నారు. మార్పు కావాలని ఓటు వేసిన వారందరూ నెత్తి, నోరు కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఉందని ఆటో ఎక్కితే డ్రైవర్ అవేదన వ్యక్తం చేశాడని, గతంలో రోజు వెయ్యి నుంచి రూ. 1500 వచ్చేవన్నారు. ఇప్పుడు అంత డబ్బు రావడం లేదని, ఈఎంఐలు, పిల్లల ఫీజులు ఎలా కట్టుకోవాలని ఆ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడని చెప్పారు. ప్రభుత్వం నెలకు వెయ్యి ఇస్తామంటోందని, పది వేలు ఇచ్చేవిధంగా ప్రభుత్వంతో మాట్లాడాలని ఆటో డ్రైవర్లు తనను కోరారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు.