నర్సింగ్ విద్యార్థులకు ఊరట
ABN , Publish Date - Mar 26 , 2024 | 03:23 AM
బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్లకు అడ్డంకిగా మారిన నీట్ ర్యాంకు అంశంపై వరంగల్లోని కాళోజీ హెల్త్యూనివర్సిటీ అధికారులు వెనక్కు తగ్గారు.
![నర్సింగ్ విద్యార్థులకు ఊరట](https://media.andhrajyothy.com/media/2024/20240322/10_a8b85c5b3e.jpg)
అన్ఫిల్డ్ సీట్లలో అడ్మిషన్లపై ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తాం
నర్సింగ్ కళాశాలలకు కాళోజీ వర్సిటీ సమాచారం
వరంగల్, మార్చి 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్లకు అడ్డంకిగా మారిన నీట్ ర్యాంకు అంశంపై వరంగల్లోని కాళోజీ హెల్త్యూనివర్సిటీ అధికారులు వెనక్కు తగ్గారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్లో ప్రచురితమైన ‘నర్సింగ్ విద్యార్థులకు నీట్ గండం’ అనే కథనానికి అధికారులు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని, మిగిలిన (అన్ఫిల్డ్) సీట్లలో అడ్మిషన్లను కొనసాగిస్తామని నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలకు సమాచారమిచ్చారు. ఐదారు రోజుల్లో నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పరిశీలించి అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రైవేటు నర్సింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, హెల్త్వర్సిటీ అధికారుల నిర్ణయంపై అన్ఫిల్డ్ సీట్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.