రాచకొండకు రాజయోగం!
ABN , Publish Date - Aug 12 , 2024 | 11:31 PM
రాచకొండకు రాజయోగం పట్టనుందా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధానంగా ఈ ప్రాంతం అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రకృతి అందాలకు మెరుగులు దిద్ది ఊటీని తలపించేలా సిద్ధం చేయాలనే చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రామోజీ ఫిలింసిటీని తలదన్నేలా మరో ఫిలిం సిటీని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం కనుచూపు మేరలో కనిపించే కొండలు కోనలు, నీటి పరవళ్లు, దట్టమైన అడవులు పచ్చటి మైదానాలతో సహజ సిద్ధ పర్యాటక కేంద్రంగా చూసేవారిని ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక్కడి ప్రదేశాలను చూస్తే రాజరిక పాలనకు సంబంధించిన ఆనవాళ్లు అడగడునా దర్శనమిస్తాయి. అరుదైన ఆయుర్వేద మూలికల నిక్షేపాలకు ఈ ప్రాంతంగా అడ్డాగా గుర్తింపు. రాచకొండను అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు ఇక్కడి భూములు బంగారమవుతాయని స్థానికులు పేర్కొంటున్నారు.
-ఊటీని తలపించేలా పకృతి అందాలకు మెరుగులు
-మరో ఫిలిం సిటీ ఏర్పాటుకు ప్రణాళిక
-ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్రెడ్డి
-సహజసిద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు
-శతృదుర్భేద్యంగా అలనాటి అంతఃపురం, కోటగోడలు
-అరుదైన ఆయుర్వేద మూలికల నిక్షేపాలకు అడ్డా
రాచకొండకు రాజయోగం పట్టనుందా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధానంగా ఈ ప్రాంతం అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రకృతి అందాలకు మెరుగులు దిద్ది ఊటీని తలపించేలా సిద్ధం చేయాలనే చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రామోజీ ఫిలింసిటీని తలదన్నేలా మరో ఫిలిం సిటీని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం కనుచూపు మేరలో కనిపించే కొండలు కోనలు, నీటి పరవళ్లు, దట్టమైన అడవులు పచ్చటి మైదానాలతో సహజ సిద్ధ పర్యాటక కేంద్రంగా చూసేవారిని ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక్కడి ప్రదేశాలను చూస్తే రాజరిక పాలనకు సంబంధించిన ఆనవాళ్లు అడగడునా దర్శనమిస్తాయి. అరుదైన ఆయుర్వేద మూలికల నిక్షేపాలకు ఈ ప్రాంతంగా అడ్డాగా గుర్తింపు. రాచకొండను అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు ఇక్కడి భూములు బంగారమవుతాయని స్థానికులు పేర్కొంటున్నారు.
మంచాల, ఆగస్టు 12: రాచకొండ ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ సభలో ఇక్కడి ప్రాశస్త్యాన్ని గుర్తుచేస్తూ సాగిన సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ ప్రాంతంపై తన అనుభూతిని వివరిస్తూ ఇబ్రహీంపట్నం నుంచి మునుగోడుకు మధ్య అటవీ ప్రాంతాన్ని చూస్తే ఊటీని తలపించేదిగా ఉంటుందంటూ చెప్పడం గమనార్హం. సమీపలోని రామోజీ ఫిలిం సిటీ సినిమా షూటింగులకు నెలవుగా ఉందని అలాగే రాచకొండ ప్రాంతంలోనూ మరో ఫిలిం సిటీని ఏర్పాటు చేస్తే దేశవిదేశాలకు చెందిన సినిమాలు ఇక్కడ రూపుదిద్దుకుంటాయని సీఎం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఫిలింసిటీ ఏర్పాటుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటనతో సమీప ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రాచకొండ ప్రాంత అభివృద్దిపై కార్యాచరణను చేపట్టాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
రాతిబండలను తొలచి ఆలయ కట్టడాలు
రాచకొండ ప్రాంతం కనుచూపు మేరలో కనిపించే కొండలు కోనలు, నీటి పరవళ్లు, దట్టమైన అడవులు పచ్చటి మైదానాలతో సహజ సిద్ధ పర్యాటక కేంద్రంగా చూసేవారిని ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక్కడి ప్రదేశాలను చూస్తే రాజరిక పాలనకు సంబందించిన ఆనవాళ్లు గోచరిస్తాయి. 15వ శతాబ్దంలో రాచకొండను రాజధానిగా చేసుకుని పాలన సాగించారు. అప్పటి చక్రవర్తి సింహభూపాలుడిచే ఈ రాజధాని నిర్మాణం సాగిందని చరిత్రకారులు చెబుతారు. వీరి పాలనా కాలంనాటి శాసనాలు ఇక్కడి రాతిబండలపై చెక్కబడి ఉన్నాయి. వాటి ద్వారా పట్టణ అనుభూతి కలిగేలా రాచకొండ నిర్మాణం జరిగిందని చెప్పవచ్చు. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో అక్కడక్కడ గ్రామాల అనవాళ్లు, ప్రజల నిత్యావసరాలకు వినియోగించే రాతి రోళ్లు తదితర వస్తువులు కనబడతుంటాయి. రాచకొండ పాలకులు దైవభక్తి గలవారు. వీరు విగ్రహారాదకులు కావడంతో అప్పట్లో నిర్మించిన దేవాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. రాతిబండలను తొలచి దేవాలయ కట్టడాలు, విగ్రహాలుగా మలచి ఉండడం చూసేవారిని అబ్బుర పరుస్తాయి.
సంకెళ్ల బావిలో ధనబాండాగారం
సుమారు రెండుమూడు వందల ఎకరాల విస్తీర్ణంతో ఎత్తైన కొండలపై అంతఃపురం నిర్మించబడి ఉంది. ఈ అంతఃపురం చుట్టూ రాతి కోటగోడ ఉంది. ఇది రాతి గోడలతో శతృదుర్భేద్యంగా రూపొందించారు. ఏడు ముఖ ద్వారాలతో ఈ అంతఃపురం ఏర్పాటు చేయబడి ఉంది. ఒక్కో ముఖ ద్వారానికి ఒక్కో నేపథ్యం ఉంటుంది. కోటగోడ లోపలే సేవకులు, సైనికులు, బాండాగారాలు, యుద్ధ సామగ్రి, గుర్రాలు ఇతరత్రా ఉండేలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఇంకా కోటగోడ లోపల వ్యవసాయానికి అనువైన పొలాలు, చెరువులు కనిపిస్తాయి. కొండపైభాగాన కొలనులు దర్శమిస్తాయి. అక్కడక్కడా రాతితో నిర్మించబడ్డ రచ్చబండలు సైతం ఉన్నాయి. చిట్ట చివరగా ఏడవ ముఖ ద్వారం తర్వాతి ప్రదేశంలో రాజుగారి విడిది కేంద్రాలు, నీటి కొలనులు ఉంటాయి. ఇంకా సంకెళ్లబావిగా అంతుచిక్కని నీటికొలను ఉంటుంది. అప్పట్లో రాజులు ఈ సంకెళ్ల బావిలో ధనబాండాగారాలు దాచిపెట్టారని చెబుతారు. ఇందుకు సాక్ష్యంగా ఆ బావి నుంచి బండపై గొలుసులు కట్టి లాగిన అనవాళ్లు కనిపిస్తాయి. పైగా ఈ సంకెళ్లభావి నుండి తంగడిపల్లి ప్రాంతానికి సొరంగమార్గం కూడా ఉండేదని చరిత్రకారులు చెబుతారు. కొండ కింది భాగంలో స్వయంభు శంభు లింగేశ్వర ఆలయం ఉంది. దేశంలోని మరెక్కడా లేని పరిమానంలో శివలింగం ఉంటుంది. ప్రతియేటా శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.ఈ ఉత్సవాలను తిలకించేందుకు సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
ప్రకృతి చికిత్సాలయ ఏర్పాటుకు అన్ని వసతులు
వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇక్కడి అడవుల్లో ఆయుర్వేద వనమూలికల నిక్షేపాలు ఉన్నాయి. ఎక్కడో శ్రీశైలం నల్లమల అడవుల్లో లభించే అరుదైన ఔషధ మొక్కలు రాచకొండలోనూ లభ్యమవుతాయి. ఇక్కడ లభించే అర్జునార్షిష్టనే నల్లమద్రి చెట్టుగా పిలుస్తారు. ఈ వనమూలికను తింటే గుండెనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పలకజెమ్మడి ఔషధానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ మూలిక కేన్సర్ నుండి విముక్తి లభిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. బెరడు చుట్టూ ముళ్లతో ఉండే బ్రహ్మజెమ్ముడులోల తెల్లటి పాలద్రవం నిక్షిప్తమై ఉంటుంది. ఈ పాలమర్థనతో ఒళ్లు, కండరాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది.. ఇవిగాక దివ్యౌషధం ఎర్రతవిటి, రాగిహంస సాంబ్రాని, కొండపిండి ఆకు, రక్తాన్ని శుద్ధి చేసే మరెన్నో ఔషధాలు రాచకొండ అడవుల్లో లభిస్తాయి. ఈ క్రమంలో అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రకృతి చికిత్సాలయాన్ని నెలకొల్పితే ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
అనువైన ప్రదేశంగా గుర్తింపు
వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతం సంస్థల ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా చెబుతారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉండడం అనుకూల అంశంగా పేర్కొనవచ్చు. అంతేగాకుండా ఓఆర్ఆర్ - ట్రిపుల్ ఆర్లకు మధ్యన ఈ ప్రాంతం ఉండడం కలిసి వచ్చే అంశం. మౌలిక వసతుల కల్పన సులభతరమౌతుంది. ఎవరైనా ఇక్కడికి సకాలంలో చేరుకోవచ్చు. రాచకొండలో ఫిలింసిటీ ఏర్పాటు చేస్త సమీప ప్రాంతాల్లో భూముల విలువలు అమాంతం పెరగడం ఖాయం. ఇంకా స్థానికులకు సైతం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.