నేడు పల్స్పోలియో
ABN , Publish Date - Mar 03 , 2024 | 04:02 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం జరగనుంది. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ పూర్తి చేసింది.
ఉదయం 7నుంచి సాయంత్రం 6వరకు
40.57 లక్షల మంది
0-5 వయసు చిన్నారులు
50.30 లక్షల పోలియో డోసులు సిద్ధం
రాష్ట్రంలో 22,445 పోలియో బూత్లు
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం జరగనుంది. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ పూర్తి చేసింది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. తెలంగాణలో 40,57,320 మంది ఆ వయసు చిన్నారులున్నారు. వారందరి కోసం 50.30 లక్షల పోలియో డోసులను వైద్యశాఖ సిద్ధం చేసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కల కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 22,445 పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. అలాగే 910 మొబైల్ బృందాలను కూడా వైద్యశాఖ అందుబాటులో ఉంచింది. 2245 మంది రూట్ సూపర్వైజర్ను రంగంలోకి దించింది. రాష్ట్రవ్యాప్తంగా 8754 మంది ఎఎన్ఎంలు 28,160 మంది ఆశా కార్యకర్తలు, 35,700 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఇందులో పాల్గొంటున్నారు. అలాగే పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత విభాగాలను వైద్యశాఖ భాగస్వామ్యం చేసింది.
మహిళా శిశు సంక్షేమం, పురపాలకశాఖ, విద్య, పంచాయతీరాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ విభాగాల సాయాన్ని తీసుకోనుంది. ఆదివారం పోలియో చుక్క లు మిస్ అయిన వారిని గుర్తించి.. సోమ, మంగళవారాల్లో వారికి వేస్తారు. హైదరాబాద్లో మాత్రం మిస్ అయిన చిన్నారుల కోసం మార్చి 6న పోలియో చుక్కలు వేస్తామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వీకర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలియోరహిత సమాజమే లక్ష్యంగా పనిజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రఽధానంగా హైరిస్క్ గ్రూపులు నివసించే మురికివాడ లు, యాచకులు, సంచార జాతులు, ఇటుకబట్టీ తయారీ కేంద్రాలు, భవన ని ర్మాణ ప్రాంతాలు, వ్యవసాయ కుటుంబాలుండే ప్రాంతాలు, కొత్తగా నిర్మిస్తున్న కాలనీలపై ఎక్కువగా దృష్టిసారించనున్నారు. కాగా, రాష్ట్రంలో 2007లో చివరిసారిగా పోలియో కేసును సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో గుర్తించారు.