Share News

సాక్షులపై ఒత్తిడి తెచ్చారు

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:40 AM

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌ మంజురు చేసే అంశంపై తీర్పును ఈడీ ప్రత్యేక కోర్టు రిజర్వ్‌ చేసింది. కవిత కుమారుడికి త్వరలో పరీక్షలు జరగనున్నాయని, ఈ సమయంలో ఒక తల్లిగా కుమారుడితో ఉండాల్సిన అవసరం ఆమెకు ఉందని కవిత తరఫు

సాక్షులపై ఒత్తిడి తెచ్చారు

వాంగ్మూలం మార్చుకోవాలని వేధించారు.. సాక్ష్యాలనూ ధ్వంసం చేశారు

మద్యం కేసులో కవితది ముఖ్య పాత్ర.. బెయిల్‌ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం

ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు.. కొడుక్కి ఎగ్జామ్స్‌.. బెయిల్‌ ఇవ్వండి

ఈ సమయంలో తన వెంట ఉండాల్సిన అవసరం ఉంది

మధ్యంతర బెయిల్‌ కోసం కవిత విజ్ఞప్తి.. తీర్పు రిజర్వు.. 8వ తేదీన వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌ మంజురు చేసే అంశంపై తీర్పును ఈడీ ప్రత్యేక కోర్టు రిజర్వ్‌ చేసింది. కవిత కుమారుడికి త్వరలో పరీక్షలు జరగనున్నాయని, ఈ సమయంలో ఒక తల్లిగా కుమారుడితో ఉండాల్సిన అవసరం ఆమెకు ఉందని కవిత తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు. అయితే, రాజకీయ నేరస్థులకు ఇలాంటి భావోద్వేగపూరిత కారణాలు వర్తించబోవని ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి కావేరీ బవేజా తీర్పును రిజర్వు చేసి, ఏప్రిల్‌ 8న వెలువరిస్తామని తెలిపింది. కాగా కవితకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసే విషయంపై ఈ నెల 20 నుంచి వాదనలు వింటామని బవేజా పేర్కొన్నారు.

పలు ఆధారాలు మా వద్ద ఉన్నాయి: ఈడీ

ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలకపాత్ర పోషించినందున, ఈ దశలో ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడం సబబు కాదని ఈడీ తరఫున న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ వాదించారు. మనీ లాండరింగ్‌ వంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన రాజకీయ నేతలకు.. మహిళలు అన్న మినహాయింపుతో బెయిల్‌ ఇవ్వొద్దన్నారు. ఈ కేసులో ముడుపులు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించిన కవిత.. మద్యం వ్యాపారంలో లబ్ధి కూడా పొందారని, సాక్ష్యాలను ధ్వంసం చేశారని తెలిపారు. నగదు మళ్లించినట్లు రుజువు చేసే బ్యాంకు ఖాతాలు, వాట్సాప్‌ డాక్యుమెంట్లు తమ వద్ద ఆధారాలుగా ఉన్నాయన్నారు. ఈడీకి తన మొబైల్‌ ఫోన్లను అందజేసే ముందు వాటిలోని సమాచారాన్ని కవిత తొలగించారని, ఇతర నిందితులు కూడా ఇదే పని చేశారని, మొత్తంగా వందకుపైగా మొబైళ్లలో సమాచారాన్ని తుడిచిపెట్టి, ధ్వంసం చేశారని తెలిపారు. దర్యాప్తులో కీలకమైన సమాచారాన్ని రాబట్టే దశలో ఉన్నామని, కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వటం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందన్నారు. తన సీఏ బుచ్చిబాబుతోపాటు పలువురు సాక్షులు తమ స్టేట్‌మెంట్లను మార్చుకోవలసిందిగా కవిత ఒత్తిడి చేశారని తెలిపారు. ఈ మేరకు కవిత బినామీ అరుణ్‌ పిళ్లై తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న విషయాన్ని హుస్సేన్‌ గుర్తు చేశారు. కవిత కుమారుడు పరీక్షల కారణంగా ఆందోళనకు గురవుతున్నారని అనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని, ఒక్క మెడికల్‌ డాక్యుమెంట్‌ కూడా ఈ విషయంలో తమకు సమర్పించలేదని తెలిపారు. కవిత కుటుంబసభ్యులు, ఆమె ముగ్గురు సోదరీమణులు.. ఆమె కుమారుడికి పరీక్షల సమయంలో అవసరమైన మానసిక మద్దతు ఇవ్వగలరని ఆయన చెప్పారు.

విచక్షణ మేరకు బెయిల్‌ ఇవ్వొచ్చు: సింఘ్వీ

కవిత తరఫున వాదించిన అభిషేక్‌ మను సింఘ్వీ.. ప్రత్యేక కోర్టు తన విచక్షణ ప్రకారం బెయిల్‌ మంజూరు చేయవచ్చన్నారు. కవిత 16 ఏళ్ల కుమారుడి పరీక్షలు జరుగుతున్నాయని, ఇటువంటప్పుడు అతడికి నైతిక, భావోద్వేగపరమైన తల్లి మద్దతు అవసరమని చెప్పారు. ఇంట్లో తండ్రి, బంధువులు, ఇంకెవరు ఉన్నా తల్లితో సమానం కాదన్నారు. ఒక నెలరోజులు కవితకు బెయిల్‌ మంజూరు చేస్తే నష్టమేమీ లేదని, ఆమె ఎక్కడికీ వెళ్లరని, ఈడీ కూడా తన దర్యాప్తును కొనసాగించుకోవచ్చని తెలిపారు. కవితను ఇప్పట్లో ఈడీ ప్రశ్నించే అవకాశం కూడా లేదని.. కాబట్టి, ఆమెకు బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రధాని మోదీ కూడా విద్యార్థుల పరీక్షల సన్నద్ధత గురించి పరీక్షా పే చర్చ కార్యక్రమంలో అనేక విషయాలు చెప్పారని సింఘ్వీ గుర్తు చేశారు.

Updated Date - Apr 05 , 2024 | 05:40 AM