‘పాలమూరు’కు జాతీయ హోదా కోసం రేవంత్, కేసీఆర్ చేసిన కృషి ఏంటి?
ABN , Publish Date - Apr 28 , 2024 | 04:26 AM
‘‘బీజేపీలో జాతీయ స్థాయి పదవిలో ఉన్న తాను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేదంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాఖ్యానించడం సిగ్గుచేటు.
![‘పాలమూరు’కు జాతీయ హోదా కోసం రేవంత్, కేసీఆర్ చేసిన కృషి ఏంటి?](https://media.andhrajyothy.com/media/2024/20240428/ff_ce019e193c.jpg)
నాపై వ్యాఖ్యలు సిగ్గుచేటు: డీకే అరుణ
రేవంత్, హరీశ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మహేశ్వర్రెడ్డి
రేపు మానుకోటకు జేపీ నడ్డా రాక
చౌదరిగూడ/మహబూబాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీలో జాతీయ స్థాయి పదవిలో ఉన్న తాను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేదంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాఖ్యానించడం సిగ్గుచేటు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి చేసిందేంటి?’’ అని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. శనివారం రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల, వీరన్నపేట్, పద్మారం, చౌదరిగూడ, లచ్చంపేట్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆమె మాట్లాడారు. తాను పార్టీ పదవిలో మాత్రమే ఉన్నారని, ప్రజాప్రతినిధిగా లేనని, ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేదంటూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. పదేళ్లు కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో దోచుకునేందుకు ఎన్నిసార్లు ప్రాజెక్టు డిజైన్లు మార్చారో చెప్పాలన్నారు. సీఎం రేవంత్రెడికి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు రాజకీయ జీవితాన్ని ఇచ్చారని, ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు ఏం చేశారని అరుణ ప్రశ్నించారు.
కాగా, రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్ మైండ్గేమ్ ఆడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. రేవంత్, హరీశ్ల మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకారమే రాజీనామా డ్రామాలు అని మండిపడ్డారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రుణమాఫీ చేయకపోతే అధికారమెందుకని వ్యాఖ్యానించిన రేవంత్.. రైతుభరోసా, పెన్షన్లు, నిరుద్యోగ భృతిపై ఎందుకు స్పందించడం లేదని, బీసీ, ఎస్సీ డిక్లరేషన్లపై ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 29న మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నట్లు ఆ పార్టీ అనుబంధ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి తెలిపారు.