అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - May 27 , 2024 | 10:41 PM
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో వాతావరణ మార్పులపై అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్రెడ్డిలతో పాటు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
![అధికారులు అప్రమత్తంగా ఉండాలి](https://media.andhrajyothy.com/media/2024/20240511/27_RR_01_80067e5533.jpg)
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి
- కలెక్టర్ శశాంక
రంగారెడ్డి అర్బన్, మే 27 : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో వాతావరణ మార్పులపై అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్రెడ్డిలతో పాటు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేస్తున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నేతృత్వంలో మండల స్థాయి సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించాలన్నారు. తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. మండల స్థాయి సమావేశం నిర్వహించేందుకు ముందు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు, రక్షిత మంచి నీటి సరఫరా జరిగేలా పర్యవేక్షణ జరపాలని, ఎక్కడైనా పైప్లైన్ లీకేజీలు ఏర్పడితే వెంటనే సరి చేసుకోవాలని తెలిపారు. ఇళ్ల మధ్య వర్షపు నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఆయిల్ బాల్స్ వేయించాలన్నారు. శానిటేషన్, తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కలెక్టర్ శశాంక తెలిపారు.
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా షార్ట్సర్క్యూట్తో విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నందున, అవసరమైన చోట తక్షణ మరమ్మతులు జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. నివాస ప్రాంతాలకు కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీగా వ్యవహరించాలని, ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో స్పెషల్ ఆఫీసర్లు పరిశీలించి గ్రామాల వారీగా నివేదికలు సమర్పించాలని తెలిపారు. వరద నీటి ప్రవాహానికి రహదారులను దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందుగా గుర్తిస్తూ, తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. ఎక్కడా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న చెరువులు, చెక్ డ్యాంలు, కాల్వలు తదితర వాటి వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.