Share News

KCR : గద్ద లెక్క వాలుతా!

ABN , Publish Date - Apr 06 , 2024 | 04:00 AM

‘‘ప్రస్తుత ప్రభుత్వ తెలివితక్కువ, అసమర్థ, అవివేక, అర్భక, చవట విధానాల దరిద్రం వల్లనే నాశనానికి వచ్చింది. 2014కు ముందు తెలంగాణలో ఏ గోస, ఏ బాధ, ఏడ్పు పడ్డామో అవి మళ్లీ వచ్చాయి. కాలిపోయిన మోటార్లు, నీళ్ల ట్యాంకర్లు, ఎండిపోయిన

KCR : గద్ద లెక్క వాలుతా!

రైతు సమస్యల పరిష్కారానికి సర్కారు మెడలు వంచుతా

ఇది అసమర్థ, అవివేక, చవట ప్రభుత్వం 4 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేస్తారా!?

ఈ దద్దమ్మలకు చేతకాకపోతే వాళ్లను పండబెట్టి తొక్కి అయినా మేడిగడ్డ

నుంచి నీటిని విడుదల చేస్తా

మేడిగడ్డలో 10 వేల మందితో ధర్నా

పంటకు రూ.500 బోనస్‌ ఇవ్వకపోతే కొరికి చంపుతారు

రుణ మాఫీ అమలుపై స్పష్టత ఇవ్వాలి

లేకపోతే, సర్కారును వెంటాడతాం

నేతన్నల సమస్యలపై రాష్ట్రమంతా

రణరంగం చేసి ఫుట్‌బాల్‌ ఆడ్తం: కేసీఆర్‌

ఇది అసమర్థ, అవివేక, అర్భక, చవట ప్రభుత్వం : కేసీఆర్‌

కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల్లో ఎండిన పంటల పరిశీలన

రైతులకు నీళ్లు అందించాలని కాళేశ్వరం స్పీడ్‌గా కంప్లీట్‌ చేశాం. పైనుంచి అధిక వర్షం రావడంతో కోమటిరెడ్డి కంపెనీ కట్టిన మిడ్‌ మానేరు కట్ట ఆనాడు కొట్టుకుపోయింది. కోమటిరెడ్డిని జైల్లో పెట్టాలనుకుంటే మేం పెట్టకపోయే వాళ్లమా!?

అడ్డమైన హామీలూ ఇవ్వడంతో మీకు 1.8 శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. మేం ఔట్‌ కాలేదు. లత్కోర్‌ హామీల కారణంగా స్వల్ప ఓట్లే ఎక్కువ వచ్చాయి.

కరీంనగర్‌, సిరిసిల్ల, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రస్తుత ప్రభుత్వ తెలివితక్కువ, అసమర్థ, అవివేక, అర్భక, చవట విధానాల దరిద్రం వల్లనే నాశనానికి వచ్చింది. 2014కు ముందు తెలంగాణలో ఏ గోస, ఏ బాధ, ఏడ్పు పడ్డామో అవి మళ్లీ వచ్చాయి. కాలిపోయిన మోటార్లు, నీళ్ల ట్యాంకర్లు, ఎండిపోయిన పంటలు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, నీళ్ల కోసం ఎదురు చూపుల సీన్లు పునరావృతమయ్యాయి. ఇది ప్రకృతి విపత్తు కాదు. ప్రభుత్వం సృష్టించిన విపత్తు’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో పంటలు ఎండని జిల్లా లేదని, నీళ్ల కరువు లేని ప్రాంతం లేదని, పాత తెలంగాణ మళ్లీ పునరావృతం అయిందని వ్యాఖ్యానించారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రాన్ని ఇంత ఆగం చేస్తారా అని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలించిన పరిస్థితి ప్రజలది అయిందని అన్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని మొగ్ధుంపూర్‌, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం శివారులో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రైతుల నుంచి ఎండిన పంటల వివరాలను తెలుసుకున్నారు. శాభా్‌షపల్లి బ్రిడ్జి నుంచి నీటి మట్టం తగ్గిన మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడారు. నీటి నిల్వ సామర్థ్యం తెల్వని లత్కోర్‌లు, చవట దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని, కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువా!? మనుషులు తెచ్చిన కరువా!? కాంగ్రెస్‌ తెచ్చిన కరువా!? అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌ ఎల్లిండు. ఇక ఆగడు. ఎక్కడ రైతులకు కష్టం వచ్చినా గద్ద లెక్క వాలుతా. సమస్యలు పరిష్కారం అయ్యేలా మెడలు వంచుతా’’ అని హెచ్చరించారు. ఎండిన పంటకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

‘‘ఇప్పుడు ఉన్నోళ్లకు కాళేశ్వరం గురించి తోక తెల్వదు. తొండం తెల్వదు. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎన్ని పంప్‌లు ఉన్నాయో వీళ్లకు తెలుసా!? ప్రాజెక్ట్‌లో చిన్న చిన్న లోపాలు జరుగుతాయి. వాటిని భూతద్దంలో పెట్టి చూపుతున్నారు. ఇప్పటికీ కాళేశ్వరంలో ఏదో వెంట్రుక దొరుకుతుందనే ఉద్దేశంతో ఉన్నారు. తెలివితక్కువతనంతో 50 టీఎంసీల నీళ్లు వదిలేశారు. కేసీఆర్‌ను బద్‌నాం చేయాలనే కుట్రతోనే నీళ్లు పోయేలా చేశారు’’ అని తప్పుబట్టారు. ఈ దద్దమ్మలకు చేతగాకపోతే గోదావరిలో నీళ్లు వచ్చే సమయంలో 50 వేల మంది రైతులతో కలిసి వెళ్లి.. వీళ్లను పండబెట్టి తొక్కి అయినా మేడిగడ్డ నుంచి నీళ్లను పంపుతానని అన్నారు. కరీంనగర్‌ జిల్లాలో నాలుగు సజీవ ధారలు సృష్టించామని, వాటి ఫలితాలను కరీంనగర్‌ ప్రజలు అనుభవించారని కేసీఆర్‌ గుర్తు చేశారు. 15 నుంచి 20 లక్షల ఎకరాల మధ్య పంటలు ఎండిపోయాయమని లెక్కలు చెబుతున్నారని, ఇందుకు నీటి నిల్వ గురించి తెలియకపోవడం ఒక కారణమైతే.. పాత బోర్లతోనైనా పంటను రక్షించుకుందామంటే నాణ్యమైన కరెంట్‌ లేకపోవడం మరో కారణమని తప్పుబట్టారు. మోటార్లు కాలిపోయి ప్రభుత్వ వైఫ్యలంతోనే పంటలు ఎండిపోయాయని విమర్శించారు. కొంతమంది మంత్రులు తమను బద్‌నాం చేస్తున్నారని, అది శుద్ధ తప్పని చెప్పారు. తమ హయాంలో 25 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ కురిసిందని, అక్కడ కూడా ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత, వైఫల్యం తప్ప వేరే కారణం లేదన్నారు. ‘‘నాలుగు మాసాల వరకూ ఏమీ అనలేదు. కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలని ఊరుకున్నా. వాళ్లు ఎన్ని పిచ్చి ఆరోపణలు చేసినా.. వాళ్లకు తొత్తులుగా ఉన్న మీడియాతో అడ్డగోలుగా వార్తలు రాయించినా మాట్లాడలేదు. ఎండిన పంటలు చూడడానికి సూర్యాపేట జిల్లాకు పోగానే కాలువలకు నీళ్లు వచ్చాయి. మళ్లీ బస్‌ పోగానే వాపస్‌ పోయాయి. కరీంనగర్‌కు వస్తున్నానంటే మొత్తం కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరం పంప్‌లను ఆన్‌ చేసి వరద కాలువకు నీళ్లు వదిలారు. అయినా.. సీఎం సిగ్గు లేకుండా కేసీఆర్‌ ముందే చెప్పాలని అంటాడు. సీఎం నువ్వా, నేనా!?’’ అని ఎద్దేవా చేశారు.

బోనస్‌ ఇవ్వకపోతే కొరికి చంపుతారు

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్‌ నిలదీశారు. బ్యాంకులతో మీటింగ్‌ పెట్టి రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంటకు రూ.500 బోనస్‌ ఇవ్వకుంటే కొరికి చంపుతారని అన్నారు. ‘‘అర్రస్‌ పాటపాడినట్లే జల్దీ రుణాలు తెచ్చుకోండి. డిసెంబరు 9న మాఫీ చేస్తానని చెప్పి నాలుగు నెలలు అయ్యింది. రైతు బంధు విషయంలో తొండి పెట్టారు. ఇస్తారా లేదా అనే కన్ఫ్యూజన్‌లో పెట్టారు. ఇంకా వంద శాతం ఇవ్వలేదు. దానిమీద ఓ పాలసీ లేదు. ధైర్యం లేదు. వెర్రి, తిర్రి వేషాల కారణంగా వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. మిమ్మల్ని వేటాడి, వెంటాడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేస్తాం’’ అని స్పష్టం చేశారు. పంటకు బోనస్‌ ఇవ్వకపోతే వెంటాడతామన్నారు. గొర్రెల పంపిణీ లేదని, దళిత బంధు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. కల్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పారని, దీనిని ఇవ్వకపోతే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు. వృద్ధాప్య పింఛనును రూ.4000 చొప్పున ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పారని, దాని సంగతి ఏమైందని నిలదీశారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, సిగ్గు లేకుండా మళ్లీ నాలుగు హామీలు ఇచ్చారని, అన్నీ మోసాలేనని మండిపడ్డారు. దళితులు, యాదవులు, మహిళలు, వృద్ధులు, కొత్త రేషన్‌ కార్డుదారులు, రైతులు.. అన్ని వర్గాలనూ మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో 200 మంది రైతులు చనిపోయారని ఆరోపిస్తే.. 48 గంటల్లో జాబితా ఇమ్మన్నారని, నాలుగు గంటల్లోనే ఇచ్చామని, అయినా ఉలుకూ పలుకూ లేదని తప్పుబట్టారు. ఆయా కుటుంబాలను పరామర్శించాలని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పాపం తగులుతుందని శపించారు.హైదరాబాద్‌లో రూపాయికి నల్లా ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ ఎందుకు ట్యాంకర్ల దందా నడుస్తోందో చెప్పాలని కేసీఆర్‌ నిలదీశారు. చీము నెత్తురు ఉంటే హైదరాబాద్‌లో ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘ప్రజలకు తాగునీళ్లు అంటే తమాషాగా ఉందా? బంగారం లాంటి మిషన్‌ భగీరథ స్కీమ్‌ను ఎందుకు నడపడం లేదు!?’’ అని ప్రశ్నించారు.

మేడిగడ్డలో పది వేల మంది రైతులతో ధర్నా

మేడిగడ్డలో పది వేల మంది రైతులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపడతామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని మొగ్దుంపూర్‌, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన పంటలను పరిశీలించారు. రైతుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం అందించాలన్నారు. బండి సంపత్‌ పొలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌కు ఎండిన పంటలను చూపిస్తూ రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. అంతకుముందు, కరీంనగర్‌ జిల్లా రామగుడు మండలం వెదిర గ్రామంలో వరి గొలుసుతో స్వాగతం పలికిన రైతులతో కేసీఆర్‌ మాట్లాడారు. పంటల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

నేత కార్మికుల సమస్యలపై రణరంగం చేస్తాం

సిరిసిల్లలో రంజాన్‌, క్రిస్‌మస్‌, బతుకమ్మ చీరలు, స్కూల్‌ యూనిఫారాలు వంటి ఆర్డర్లతో చేనేత కార్మికులకు తాము ఉపాధి కల్పించామని, ఇప్పుడు మళ్లీ పాత రోజలే వచ్చాయని కార్మికలు చెబుతున్నారని కేసీఆర్‌ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన రూ.300 కోట్ల బకాయిలు కూడా ఇవ్వడం లేదని చెప్పారని, హైకోర్టుకు వెళ్లయినా బకాయిలు ఇప్పిస్తామని చెప్పారు. ‘‘సిరిసిల్లలో మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యేట్లు ఉన్నాయని అంటే.. ఓ కాంగ్రెసోడు నిరోధ్‌లు, పాపడ్‌లు అమ్ముకుని బతకమని అన్నాడు. నిరోధ్‌లు అమ్ముకుని బతకాలా కుక్కల కొడుకుల్లారా!? మీరు మనుషులేనా? చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా!? చేనేత కార్మికులను మొన్నటిదాకా దొబ్బితిన్నారు.. దోచుకుతిన్నారని అంటారా దొంగ నా కొడుకుల్లారా’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చేనేత కార్మికుల సమస్యలపై రాష్ట్రమంతా రణరంగం చేసి పుట్‌బాల్‌ ఆడతామని, విడిచిపెట్టమని హెచ్చరించారు. చేనేత కార్మికులను నీచంగా మాట్లాడిన కాంగ్రెస్‌ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 06 , 2024 | 04:04 AM