తొలిరోజు జాతర!
ABN , Publish Date - Apr 19 , 2024 | 04:56 AM
పార్లమెంటు ఎన్నికలకు తొలిరోజే నామినేషన్ల జాతర సాగింది. లోక్సభ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వగా తొలిరోజే మొత్తం 48 దాఖలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు భారీ ర్యాలీలు,
మొత్తం 48 నామినేషన్లు దాఖలు చేసిన 42 మంది అభ్యర్థులు
బీజేపీ నుంచి ఈటల, రఘునందన్, డీకే అరుణ, భరత్ ప్రసాద్
కాంగ్రెస్ నుంచి మల్లు రవి, నీలం మధు, సురేష్ షెట్కార్
నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ నింపేటప్పుడు జాగ్రత్త: సీఈవో\
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఎన్నికలకు తొలిరోజే నామినేషన్ల జాతర సాగింది. లోక్సభ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వగా తొలిరోజే మొత్తం 48 దాఖలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు భారీ ర్యాలీలు, కోలాహలం మధ్య తమ నామినేషన్లను సమర్పించారు. బీజేపీ నుంచి మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఒక సెట్ వేయగా, ఆయన భార్య జమున కూడా మరో సెట్ నామినేషన్ను ఎన్నికల అధికారికి అందించారు. ఈటల వెంట కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, కిషన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పార్టీ మెదక్ అభ్యర్థి రఘునందన్రావు, మహబూబ్నగర్ అభ్యర్థి డీ కే అరుణ, నల్లగొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, నాగర్ కర్నూలు అభ్యర్థి భరత్ ప్రసాద్ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో అరుణ వెంట ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఉన్నారు. ఇక, నాగర్ కర్నూలు ఎంపీ స్థానంలో కాంగ్రెస్ నుంచి డాక్టర్ మల్లు రవి నామినేషన్ను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నీలం మధు నామినేషన్ను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎన్నికల అధికారికి అందించగా.. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరపున ఆయన వర్గీయులు ఒక సెట్ను దాఖలు చేశారు. పార్లమెంటు స్థానాల వారీగా పరిశీలిస్తే.. పెద్దపల్లి (ఎస్సీ) పరిధిలో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మహబూబాబాద్లో స్వతంత్ర అభ్యర్థి ఒక్కరే నామినేషన్ సమర్పించారు. చేవెళ్లలో మూడు; మెదక్లో బీజేపీ, కాంగ్రె్సతోపాటు మరో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లగొండలో నాలుగు; భువనగిరిలో మూడు; ఖమ్మం నుంచి ఒకటి; నిజామాబాద్ పరిధిలో రెండు; మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి 8 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే, మహబూబ్నగర్ స్థానానికి రెండు; వరంగల్లో మూడు, కరీంనగర్లో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్, హైదరాబాద్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.