Share News

ఎన్టీపీసీ ‘రెండో దశ’తో ఒప్పందానికి నో!

ABN , Publish Date - Apr 01 , 2024 | 06:00 AM

రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన రెండో విడత తెలంగాణ సూపర్‌ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం నుంచి కరెంటు కొనుగోలు చేస్తే రాష్ట్రానికి పెనుభారంగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. 2400 మెగావాట్ల సామర్థ్యంతో తలపెట్టిన ఈ విద్యుత్కేంద్రం నిర్మాణానికి ఐదు

ఎన్టీపీసీ ‘రెండో దశ’తో ఒప్పందానికి నో!

2400 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణం.. కరెంటు కొనుగోలుకు సర్కారు విముఖత

విద్యుత్తు వచ్చేది 5-8 ఏళ్ల తర్వాతే!

అప్పటికి రూ.8-9 మధ్య యూనిట్‌ ధర

ఒప్పందం చేసుకుంటే రాష్ట్రానికి గుదిబండే!

హైదరాబాద్‌ మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన రెండో విడత తెలంగాణ సూపర్‌ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం నుంచి కరెంటు కొనుగోలు చేస్తే రాష్ట్రానికి పెనుభారంగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. 2400 మెగావాట్ల సామర్థ్యంతో తలపెట్టిన ఈ విద్యుత్కేంద్రం నిర్మాణానికి ఐదు నుంచి ఎనిమిదేళ్లు పడుతుందని.. అప్పటికి ఇక్కడి నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.8-9కి ఎగబాకుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనాకు వచ్చింది. బహిరంగ మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకే విద్యుత్తు లభిస్తుండగా, భారీ ధరతో 25 ఏళ్ల పాటు కరెంటు కొనుగోలుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రజలపై రూ.వేల కోట్ల అనవసర భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీతో ఎలాంటి విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. త్వరగా ఒప్పందం చేసుకోకపోతే ఇతర రాష్ట్రాలతో అగ్రిమెంట్‌ చేసుకుని విద్యుత్కేంద్రం నిర్మిస్తామని ఎన్టీపీసీ ఇటీవల అల్టిమేటం జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమీక్షించి, కొనుగోలు ఒప్పందం చేసుకోరాదని నిర్ణయించింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్తు కొరతను తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టం-2014లో కేంద్రం హామీ ఇవ్వగా, తొలి విడత కింద 1600 మెగావాట్ల విద్యుత్కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. రెండో విడత కింద 2400 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది. తొలి విడత విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.5.90 ఉండగా, ఒప్పందం కారణంగా కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఉంది.

గత సర్కారు తప్పిదమే..!

పదేళ్లలో గత ప్రభుత్వం చేసిన పాపాలు రాష్ట్రంలో విద్యుత్తు సంస్థలకు గుదిబండగా మారాయని కాంగ్రెస్‌ సర్కారు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రెండో విడతలో 2400 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణానికి ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా 10 ఏళ్లపాటు జాప్యం చేయడమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అప్పట్లో ఒప్పందం చేసుకొని ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తయి, తక్కువ ధరకు రాష్ట్రానికి కరెంటు వచ్చేదని చెబుతున్నాయి. ఇప్పడు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కొత్త థర్మల్‌ ప్లాంట్లకు స్వస్తి..

దామరచర్లలో తెలంగాణ జెన్‌కో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం నాలుగేళ్ల కిందే పూర్తికావాల్సి ఉండగా, ఇంకా పనులు సాగుతున్నాయి. జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగింది. కాలం చెల్లిన సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి విద్యుత్తు కేంద్రం వ్యయం సైతం భారీగా పెరగడంతో దాని విద్యుత్తు ధరలూ పెరిగిపోయాయి. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్‌ సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయంగా మార్కెట్‌లో రూ.2-4కు యూనిట్‌ చొప్పున లభిస్తున్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. సౌర, జల, పవన, పంప్డ్‌ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజ్‌ విద్యుత్తుపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది.

Updated Date - Apr 01 , 2024 | 06:00 AM