Share News

యాదగిరిక్షేత్రంలో శాస్త్రోక్తంగా నీరాటోత్సవాలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:27 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్‌ అమ్మవారి నీరాటోత్సవాలు, స్వామికి నిత్య పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి.

యాదగిరిక్షేత్రంలో శాస్త్రోక్తంగా నీరాటోత్సవాలు
లక్ష్మీనృసింహుల తిరుకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

ఆలయ తిరువీధుల్లో స్వామివారి సేవ

యాదగిరిగుట్ట, జనవరి 11: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్‌ అమ్మవారి నీరాటోత్సవాలు, స్వామికి నిత్య పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. ప్రభాతవేళ సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు పంచామృతాలతో స్వయంభువులను అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. ప్రధానాలయ ఉత్తర దిశలోని మొదటి ప్రాకార మండపంలో ఆండాళ్‌ అమ్మవారిని ఆరాధిస్తూ తిరుప్పావై పాశుర పఠనం చేశారు. హోమం, నిత్య తిరుకల్యాణోత్సవాలను నిర్వహించిన అర్చకులు ఆండాళ్‌ అమ్మవారిని పెళ్లి కూతురుగా, లక్ష్మీనృసింహుడిని రంగనాఽథుడిగా అలంకరించి తిరువీధి సేవోత్సవం నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవిని పెళ్లికూతురుగా అలంకరించి శ్రీరంగనాఽథుడిని చేరుకునే ఘట్టాలను యాదగిరిక్షేత్రంలో ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. గోదా కల్యాణోత్సవంతో నీరాటోత్సవాలు పరిసమాప్తమవుతాయు. ధనుర్మాసపర్వాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ రాత్రి 7గంటలకు గోదా కల్యాణం, 15న మధ్యాహ్నం ఒడి బియ్యం సమర్పణ ఘట్టాలు కొనసాగనున్నాయి.

మార్చి 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఏక శిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు మార్చి 11న ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, విశ్వక్సేన పూజలతో సంప్రదాయరీతిలో శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 12న ధ్వజారోహణం, 17న స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, 18న బ్రహ్మోత్సవ తిరుకల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న చక్రతీర్థం, మహాపూర్ణాహుతి, 21న అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.

Updated Date - Jan 12 , 2024 | 12:27 AM