Share News

గవర్నర్‌గా ఉన్నప్పుడు నా ఫోనూ ట్యాప్‌ చేశారు

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:21 AM

తెలంగాణలో రాజకీయ కలకలం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో రాష్ట్ర మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ గవర్నర్‌గా ఉన్న సమయంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని

గవర్నర్‌గా ఉన్నప్పుడు నా ఫోనూ ట్యాప్‌ చేశారు

2022లోనే చెప్పా

నాటి సర్కారు విషయాన్ని పక్కదారి పట్టించింది

ప్రస్తుత దర్యాప్తుతో నేను చెప్పింది నిజమని తేలింది

మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రాజకీయ కలకలం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో రాష్ట్ర మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ గవర్నర్‌గా ఉన్న సమయంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని పేర్కొన్నారు. తన ఫోన్‌ ట్యాప్‌ అవుతుందని 2022లోనే తొలిసారి ప్రకటించానని, కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఆరోపణలంటూ విషయాన్ని పక్కదారి పట్టించిందని గుర్తు చేశారు. బీజేపీ తరఫున తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన తమిళిసై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజాలేనని ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో స్పష్టం అవుతోందని తమిళిసై పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉంది. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంపిక చేసిన పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నలుగురు పోలీసులు ఇప్పటికే అరెస్టు అయ్యారు. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును విచారించాల్సి ఉంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, కీలక నిందితులు పరారీలో ఉన్నారని దర్యాప్తు అధికారులు ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో మాజీ గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాగా తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆమెకు తగిన ప్రోటోకాల్‌ పాటించని విషయం తెలిసిందే.

Updated Date - Apr 18 , 2024 | 04:22 AM