మోదీ బడేభాయ్.. రేవంత్ చోటేభాయ్!
ABN , Publish Date - Mar 08 , 2024 | 04:51 AM
‘‘మోదీ బడేభాయ్... రేవంత్చోటేభాయ్.. వాళ్లిద్దరూ ఒక్కటే’’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ తెలంగాణ కోసమే పుట్టింందని, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడే పార్టీనే గెలిపించాలని కోరారు.
టీడీపీ, కాంగ్రెస్ వల్లే పాలమూరు వెనుకబాటు
రేవంత్రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు: హరీశ్రావు
నారాయణఖేడ్/సంగారెడ్డి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘‘మోదీ బడేభాయ్... రేవంత్చోటేభాయ్.. వాళ్లిద్దరూ ఒక్కటే’’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ తెలంగాణ కోసమే పుట్టింందని, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడే పార్టీనే గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనని, ఎప్పుడూ జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి రేవంత్కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నారాయణఖేడ్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంతోపాటు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్ మాట్లాడారు. బీఆర్ఎస్ హయాలో చేపట్టిన పథకాలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతల మెడలు వంచాలన్నారు. పాలమూరు వెనుకబాటుకు నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనలే కారణమని విమర్శించారు. రేవంత్రెడ్డి తిట్టాల్సివస్తే ముందుగా తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ చేసిన మోసాలను నిందించాలని సూచించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారన్నారు. అలాంటి కేసీఆర్ను తిట్టడం అవివేకమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదే పదే తన ఎత్తు గురించి మాట్లాడతారని, కానీ తాను అలా మాట్లాడి విలువ తగ్గించుకోనని అన్నారు.