ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Jan 05 , 2024 | 03:16 AM
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ గురువారం షెడ్యూల్ను ప్రకటించింది.
![ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
11 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ
29న పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి
కడియం, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 స్థానాలు
హైదరాబాద్/న్యూఢిల్లీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ గురువారం షెడ్యూల్ను ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపింది. అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 18తో నామినేషన్ల గడువు ముగియనుంది. 19న నామినేషన్ల పరిశీలన, 22 దాకా ఉప సంహరణకు అవకాశం ఉంటుంది. 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల పదవీ కాలం 2027 నవంబరు 30వరకు ఉంటుంది. యూపీలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికీ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది.