ఆండ్రాయిడ్ ఆధారిత యంత్రాలతో మీటర్ రీడింగ్
ABN , Publish Date - Feb 17 , 2024 | 03:57 AM
విద్యుత్ బిల్లుల జారీ విధానంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని దక్షిణ డిస్కమ్(ఎస్పీడీసీఎల్-హైదరాబాద్) నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా డిస్కమ్లు రీ
![ఆండ్రాయిడ్ ఆధారిత యంత్రాలతో మీటర్ రీడింగ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ బిల్లుల జారీ విధానంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని దక్షిణ డిస్కమ్(ఎస్పీడీసీఎల్-హైదరాబాద్) నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా డిస్కమ్లు రీడింగ్ తీసే కనెక్షన్లు 1.54 కోట్ల దాకా ఉన్నాయి. డేటాను మరింత కచ్చితంగా రాబట్టుకోవడంలో భాగంగా ఆండ్రాయిడ్ ఆధారిత సాఫ్ట్వేర్తో పనిచేసే ‘ఇంటిగ్రేటెడ్ ఆల్ ఇన్ వన్ ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ యంత్రాలు’ సమకూర్చుకోవాలని ఎస్పీడీసీఎల్ యోచిస్తోంది. ఇందుకోసం ఆఽధునిక బిల్లింగ్ యంత్రాలను సమకూర్చే సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సరఫరాదారులతో ఈనెల 22న హైదరాబాద్లోని మింట్కాంపౌండ్లో సమావేశం జరగనుంది. దక్షిణ డిస్కమ్ పరిధిలో 4వేల దాకా యంత్రాలు అవసరం. ప్రస్తుతం ఇన్ఫ్రారెడ్(ఐఆర్) టెక్నాలజీతో మీటర్ రీడింగ్ తీస్తున్నారు. దీంతో మీటర్ ముందు యంత్రం పెట్టగానే బిల్లు జనరేట్ అవుతుంది. ఈ యంత్రాలతో ఒక ఉద్యోగి రోజుకు 200 కనెక్షన్లకు మాత్రమే రీడింగ్ తీసే అవకాశం ఉండగా...ఆండ్రాయిడ్ ఆధారిత యంత్రాలతో రోజుకు 400 దాకా కనెక్షన్లకు బిల్లులు జారీ చేయవచ్చు.