Share News

మేడిగడ్డ మరింత కుంగింది!

ABN , Publish Date - Apr 09 , 2024 | 04:28 AM

కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు, ఏప్రన్‌ మరింత కుంగాయి. గత అక్టోబరులో డ్యామేజీ విషయం బయటపడినపుడు ఏడో బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లు, వాటికి కింద ఉండే ఏప్రన్‌

మేడిగడ్డ మరింత  కుంగింది!

గతంలో ఒకటిన్నర అడుగుల మేరకే

ఇప్పుడు 4-5 అడుగుల మేర కుంగుబాటు

నెల రోజుల వ్యవధిలోనే స్పష్టమైన మార్పు

మరింత లోపలికి వెళ్లిన పియర్లు, ఏప్రన్‌

క్రస్ట్‌ స్పిల్‌ వేలోనూ పెరుగుతున్న పగుళ్లు

నిర్మాణంలో బొగ్గు బైటపడినట్లు ప్రచారం

భూపాలపల్లి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు, ఏప్రన్‌ మరింత కుంగాయి. గత అక్టోబరులో డ్యామేజీ విషయం బయటపడినపుడు ఏడో బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లు, వాటికి కింద ఉండే ఏప్రన్‌ అడుగున్నర మేర కుంగాయి. తాజాగా నాలుగైదు అడుగుల మేర కుంగినట్లు కనిపిస్తోంది. ఏడో బ్లాక్‌ పియర్లు రోజురోజుకూ కుంగిపోతున్నాయని, బ్యారేజీ మరింత ప్రమాదంలోకి వెళుతోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. పియర్లు, బ్యారేజ్‌ బే ఏరియా, క్రస్ట్‌ స్పిల్‌వేలోనూ పగుళ్లు మరింత పెరుగుతున్నాయి. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పర్యటించి దెబ్బతిన్న భాగాన్ని అధ్యయనం చేసి వెళ్లిన కొద్ది రోజులకే ఈ మూడు పియర్ల వద్ద ఏప్రన్‌ మరింత కుంగినట్లు తెలుస్తోంది. దెబ్బతిన్న పియర్లను పరిశీలించేందుకు సోమవారం మేడిగడ్డను సందర్శించిన సీపీఎం బృందంతోపాటు వెళ్లిన మీడియా ప్రతినిధులకు పియర్లు మరింత కుంగిపోయిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ బృందం, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భాల్లో పియర్లు, ఏప్రన్ల వద్ద అడుగున్నర మాత్రమే కుంగిపోయి ఉంది. మార్చి 7 నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల పరిశీలన సమయంలోనూ దాదాపుగా అదే తీరుగా కనిపించింది. నెల రోజుల తర్వాత సోమవారం పరిశీలించినపుడు ఎక్కువగా కుంగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఏప్రన్లతో పాటు బ్యారేజీ బేఏరియాలోను పగుళ్లు ఏర్పడుతూ ఉండడం గమనించాల్సిన విషయం. దెబ్బతిన్న ఏప్రన్‌ మరమ్మతులో భాగంగా మొత్తంగా ఏడో బ్లాక్‌ను తొలగించి పునర్నిర్మిస్తే తప్ప బ్యారేజీ నిలబడదని ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే, మరమ్మతుల కోసం నిపుణుల బృందం సూచించిన మేరకు నిర్మాణ సంస్థ బ్యారేజీకి ఎగువ భాగంలో నీటికి అడ్డుగా వేసిన మట్టి కట్ట నుంచి కూడా నీటి ఊటలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా నీరు లీకేజీ జరిగితే దెబ్బతిన్న ఆఫ్రాన్‌కు మరింత నష్టం చేకూరే అవకాశం ఉందని చెబుతున్నారు.

భూ అంతర్గత పొరల బలహీనత వల్లేనా?

మేడిగడ్డ బ్యారేజీ పియర్లు దెబ్బ తినడానికి ఏడో బ్లాక్‌ ప్రాంతంలో ఉన్న భూమి అంతర్గత పొరలు బలహీనంగా ఉండటమే కారణం కావచ్చని రిటైర్డ్‌ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. బ్యారేజీలో భారీ పరిమాణంలో ఇసుక మేటలు వేసి ఉండటం, దాదాపు 250 మీటర్ల లోతు వరకు భూమి పొరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా ఏప్రన్లపై ఒత్తిడి పడుతోందని అంటున్నారు. దీనివల్ల భూ అంతర్గత పొరల్లో సర్దుబాట్లు జరిగి పిల్లర్లు క్రమంగా కుంగిపోతున్నాయని చెబుతున్నారు. క్రస్ట్‌ స్పిల్‌వే వరకు దాని ప్రభావం పడి ప్రాజెక్టు దెబ్బ తింటోందని వివరిస్తున్నారు. ఈ కారణంగానే క్రస్ట్‌ స్పిల్‌వేలో పగుళ్లు ఏర్పడి అవి పెరుగుతూ పోతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. నిర్మాణ సమయంలోడ్రిల్లింగ్‌ సందర్భంగా భూ అంతర్గత పొరల్లో ఉన్న బలహీనతలు స్పష్టంగా తెలిసిపోతాయని, బహిర్గత ఒత్తిళ్ల్లో లేదా నిర్మాణ సంస్థ, ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్లనో వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగడం వల్ల ఇప్పటి పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఏప్రన్ల నిర్మాణం కోసం తవ్విన గుంతల్లో బొగ్గు బయటపడినట్లు ప్రచారం సాగుతోంది. విషయం బయటకు వస్తే నిర్మాణం ఆగిపోతుందని మూడో కంటికి తెలియకుండా మహారాష్ట్ర వైపు తరలించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, ఏడో భాగం నుంచి మహారాష్ట్ర వైపు పియర్లన్నీ ప్రమాదంలో ఉన్నట్టే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Updated Date - Apr 09 , 2024 | 04:28 AM