Share News

సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:33 AM

సినీనటుడు, సీనియర్‌ నటుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు నడుపుతున్న కారు ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొంది. ఈ ఘటనలో ఆ బైక్‌ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఈ ప్రమాదం

సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

మృతుడు నల్లగొండ బీఆర్‌ఎస్‌ పట్టణ నేత

బైక్‌తో రోడ్డు దాటుతుండగా ఢీ

ఆ సమయంలో రఘుబాబు చేతుల్లోనే స్టీరింగ్‌

నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో ప్రమాదం

అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు

నల్లగొండ టౌన్‌, ఏప్రిల్‌ 17: సినీనటుడు, సీనియర్‌ నటుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు నడుపుతున్న కారు ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొంది. ఈ ఘటనలో ఆ బైక్‌ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. మృతుడు బీఆర్‌ఎస్‌ నాయకుడు, నల్లగొండ శ్రీనగర్‌ కాలనీకి చెందిన సందినేని జనార్దన్‌ రావు (55). బీఆర్‌ఎస్‌ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జనార్దన్‌ రావు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కూడా. అద్దంకి బైపాస్‌ రోడ్డులో ఓ వెంచర్‌ ఏర్పాటు చేసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై వెంచర్‌కు వెళుతూ నల్లగొండ శివారులోని లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు దాటున్నాడు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న రఘుబాబు బీఎండబ్ల్యూ కారు, జనార్థన్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జనార్దన్‌ గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై పడి.. పక్కన డివైడర్‌పై పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. టూటౌన్‌ ఎస్‌ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రఘుబాబు వెనుకే ఆయన కుమారుడు రేంజ్‌రోవర్‌ కారులో వస్తూ ప్రమాదస్థలి వద్ద ఆగారు. ఆ రేంజ్‌రోవర్‌లోనే రఘుబాబును పోలీసులు ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారు. జనార్దన్‌ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304/ఏ సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 18 , 2024 | 04:33 AM