కొడంగల్కు మహర్దశ!
ABN , Publish Date - Aug 26 , 2024 | 11:50 PM
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కు మహర్దశ పట్టనుంది. కడా కింద అన్నీ విధాలుగా అభివృద్ధి కోసం బాటలు పడతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ్గ పరిధిలో ఆర్అండ్బీ డబుల్ లైన్ రోడ్లు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా పంచాయతీ రాజ్ రోడ్లు,గ్రామీణ అంతర్గత రోడ్లు, గిరిజన తండాలను కలిపే వాటిని గుర్తించి బీటీ రోడ్లుగా మార్చేంందుకు ప్రతిపాదనలు పంపించారు.
పీఆర్ రోడ్ల అభివృద్ధికి రూ.1100 కోట్ల ప్రతిపాదనలు
గ్రామాల అభివృద్ధికి వేయి కోట్లతో ప్రణాళికలు
కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల సుందరీకరణకు రూ.400కోట్లపైగా నిధులు
సీఎం నియోజకవర్గం కడా పరిధిలో అభివృద్ధి పనులకు బాటలు
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కు మహర్దశ పట్టనుంది. కడా కింద అన్నీ విధాలుగా అభివృద్ధి కోసం బాటలు పడతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ్గ పరిధిలో ఆర్అండ్బీ డబుల్ లైన్ రోడ్లు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా పంచాయతీ రాజ్ రోడ్లు,గ్రామీణ అంతర్గత రోడ్లు, గిరిజన తండాలను కలిపే వాటిని గుర్తించి బీటీ రోడ్లుగా మార్చేంందుకు ప్రతిపాదనలు పంపించారు.
కొడంగల్, ఆగస్టు 26: కొడంగల్ నియోజవర్గంలో అభివృద్ధిలో భాగంగా కడా కింద అన్నీ విధాలుగా అభివృద్ధి కోసం బాటలు పడనున్నాయి. ఇప్పటికే నియోజకరవ్గ పరిధిలో ఆర్అండ్బీ డబుల్ లైన్ రోడ్లు రూ.344.5 కోట్లతో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధికి రూ.1130 కోట్లతో గ్రామీణ అంతర్గత రోడ్లు, గిరిజన తండాలను కలిపే వాటిని గుర్తించి బీటీ రోడ్లుగా మార్చేంందుకు ప్రతిపాదనలు పంపించారు. రోడ్ల అభివృద్ధి కోసం రూ.1130 కోట్ల అంచనా వ్యయంతో త్వరలోనే మంజూర్తో పనులు ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తెలిపారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధికి కడా ఏర్పాటు చేసి సమస్యలను గుర్తించడంతో వాటి పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సీఎం రేవంత్రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు సీఎస్ శాంతికుమారి, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్తో పాటు వికారాబాద్, నారాయణపేట్ జిల్లాల కలెక్టర్లు తరచూ పర్యటనలతో అభివృద్ధికి బాటలు వేయనున్నారు.
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
కొడంగల్ నియోజకవర్గంలో కడా పరిధిలో ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఇతరాత్ర ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం రూ.వేయి కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. గ్రామాలు, తండాల్లో ప్రధానంగా శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు, నూతన కమ్యూనిటీ హాళ్లు, తాగునీటి సరఫరా కోసం వాటర్ ట్యాంకులు, డ్రైనేజీలు ఏర్పాటు చేయనున్నారు. సీఎం రేవంత్రెడ్డి చొరవతో గ్రామాల అభివృద్ధికి త్వరలోనే నిధుల మంజూరుతో పనులు ప్రారంభం కానున్నాయి.
మున్సిపాలిటీల సుందరీకరణ
నియోజకవర్గానికి గుండె కాయగా ఉన్న కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల్లో సమస్యల గుర్తింపుతో కడా కింద ప్రభుత్వానికి నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించారు. మున్సిపాలిటీల సుందరీకరణలో భాగంగా రూ.400 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపించారు. త్వరలో నిధుల మంజూరుతో పనులు ప్రారంభం కానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో ప్రధానంగా కొడంగల్ అంబేడ్కర్ చౌరస్తా, వినాయక చౌరస్తా విస్తరణ పనులు, రోడ్డుకిరువైపులా వైండిగ్తో హైమాస్ట్ దీపాల ఏర్పాటు, కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతరాత్ర పనులు చేపట్టనున్నాయి. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా కోసం రూ.40 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రూ.121 కోట్లు, వర్షపు నీరు నిల్వ కోసం రూ.62 కోట్లు, పట్టణాల్లో ఇరువైపులా వైండింగ్ కోసం రూ.54 కోట్లు, స్టేడియం, ప్లే గ్రౌండ్ కోసం రూ.12 కోట్లతో పాటు ఇతరాత్ర పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి రూ.344.5 కోట్లు
కొడంగల్ నియోజకవర్గంలోని పలు ప్రధాన గ్రామాలను కలిపే సింగిల్ లైన్ రోడ్లను డబుల్ లైన్ రోడ్లుగా మార్చేందుకు నిధులు మంజూరయ్యాయి. అందులో భాగంగా డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం కోసం రూ.344.5 కోట్ల అంచనాతో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. అందులో హస్నాబాద్ నుంచి నీటూర్ వరకు ఆలేడ్ నుంచి హకీంపేట్ మీదుగా పోలెపల్లి, దిర్సంపల్లి వరకు, అంగడిరైచూర్ గేటు నుంచి రుద్రారం వరకు, రావుల్పల్లి నుంచి దౌల్తాబాద్ వరకు తదితర గ్రామాల రోడ్ల అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
అభివృద్ధికి నివేదికలు పంపించాం
కడా పరిధిలో పంచాయతీ రోడ్ల అభివృద్ధి కోసం రూ.1130 కోట్లు, కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల సుందరీకరణకు రూ.400 కోట్లకుపైగా, గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి కోసం వేయి కోట్లుతో పాటు వివిధ అభివృద్ధి పనుల కోసం నివేదికలను ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే నిధుల మంజూరుతో పనులు ప్రారంభంఅవుతాయి.
వెంకట్రెడ్డి, కడా ప్రత్యేకాధికారి
ఫ మారనున్న కొడంగల్ రూపు రేఖలు
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రాంతం అభివృద్ధితో రూపు రేఖలు మారనున్నాయి. ఇప్పటికే డబుల్ లైన్ రోడ్లు, ఆర్ అండ్ బీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధి కోసం త్వరలోనే అత్యధిక నిధులు మంజూరు కానున్నాయి. దీంతో పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్