ఎంపీ ఎన్నికల్లో స్థానికుడికే అవకాశం ఇవ్వాలి
ABN , Publish Date - Jan 09 , 2024 | 11:26 PM
దేశంలోనే అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో పోటీకి ఆ పరిధిలోని నాయకులకే అవకాశం ఇవ్వాలని, ప్యారాషూట్ లీడర్లు వద్దని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మేడ్చల్రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్రెడ్డి, రాష్ట్రఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్రెడ్డి అధిష్ఠానాన్ని కోరారు.
![ఎంపీ ఎన్నికల్లో స్థానికుడికే అవకాశం ఇవ్వాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/9mdcl1_5e615ea294.jpg)
మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి ఎంపికపై బీజేపీ సీనియర్ నాయకుల మొర
మేడ్చల్ జనవరి9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : దేశంలోనే అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో పోటీకి ఆ పరిధిలోని నాయకులకే అవకాశం ఇవ్వాలని, ప్యారాషూట్ లీడర్లు వద్దని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మేడ్చల్రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్రెడ్డి, రాష్ట్రఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్రెడ్డి అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు వారు మంగళవారం దమ్మాయిగూడ తిరుమల గార్డెన్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంతో మంది నాయకులు 45 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నారని, వారిని అధిష్ఠానం గుర్తించి అవకాశమివ్వాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తల, నాయకుల మనోభావాలని పరిగణలోకి తీసుకుని ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేయాలన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని వ్యక్తికి అవకాశమిస్తే అందరం కలిసికట్టుగా గెలిపిస్తామని వారు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉండే బీజేపీ నాయకులకు ప్రజల సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందని, నిత్యం ప్రజల్లో ఉంటూ ఇప్పటికే పార్టీ కోసం ఎంతో శ్రమించిన వారిని గుర్తించాలన్నారు. నియోజకవర్గంపై అవగాహన లేని వ్యక్తులకు అవకాశమిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రపంచమంతా నేడు మోదీ వైపు చూస్తున్నదని , మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివాసం ఉంటున్నారని, అన్నింటిని దృష్టిలో పెట్టుకుని స్థానికుడికే అవకాశమివ్వాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, జిల్లా స్పోక్ పర్సన్ సంపత్ యాదవ్, , నాయకులు తిరుమలరెడ్డి, రవీందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.