అర్హులందరికీ రుణాలివ్వాలి : కలెక్టర్
ABN , Publish Date - Feb 13 , 2024 | 11:30 PM
అర్హులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి జిల్లాస్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
రంగారెడ్డి అర్బన్, జనవరి 13 : అర్హులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి జిల్లాస్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులు పంట అనుబంధ రుణాలు, ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న, మధ్య తరహా, విద్య, గృహ రుణాలతో పాటు ఇతర ప్రాధాన్యత రుణాలను అర్హులైన పేద ప్రజలకు మంజూరు చేయాలని సూచించారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయాలన్నారు. అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించి నిర్ణ్ణీత గడువులోగా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాల రుణ పరిమితిని పెంచాలని, ఇచ్చిన రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే విధంగా బ్యాంకర్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. బ్యాంకులు వార్షిక సంవత్సరం ముగిసేలోగా వారి లక్ష్యాలను అధిగమించాలన్నారు. రైతులకు పంట, అనుబంధ రుణాలతో పాటు, డెయిరీ, పౌలీ్ట్ర, తదితర యూనిట్లను మంజూరు చేయడం ద్వారా రైతులకు రెండు రకాల ఆర్థిక ప్రగతి పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. బ్యాంకుల వారీగా లక్ష్ష్యాలు, సాధించిన ప్రగతిపై చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ ప్రతీమాసింగ్ డిజిటల్ ఇండియా పవర్ టు ఎంపవర్ (డిజిటల్ సేవా మోడల్ సిఎస్సి సెంటర్) పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎల్డీఎం జి.కుసుమ, ఆర్బీఐ అధికారి ఎకె.కల్బోరి, జీఎండీఐసీ జె. రాజేశ్వర్రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, గిరిజన శాఖ అధికారి రామేశ్వరీదేవి, మెప్మా పీడీ శంకర్సింగ్, సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.