Share News

CM Revanth Reddy: విన్నపాలు వినవలె.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ చేసిన విజ్ఞప్తులు ఇవే!

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:35 AM

రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని కోరారు. కేంద్ర ప్రభుత్వం సహకారం కోరుతూ పలు

CM Revanth Reddy: విన్నపాలు వినవలె.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ చేసిన విజ్ఞప్తులు ఇవే!

‘తుమ్మిడిహెట్టి’ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించండి

‘ఇంటింటికీ నల్లా నీరు’కు సహకరించండి

‘హైదరాబాద్‌-శ్రీశైలం’ కారిడార్‌ మంజూరు చేయండి

సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు తోడ్పడండి

ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తులు

విన్నపాలు వినండి..!

‘తుమ్మిడిహెట్టి’ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించండి

‘ఇంటింటికీ నల్లా నీరు’కు సహకరించండి

సెమీ కండక్టర్ల పరిశ్రమకు తోడ్పడండి: ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ విజ్ఞప్తులు

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని కోరారు. కేంద్ర ప్రభుత్వం సహకారం కోరుతూ పలు విజ్ఞప్తులు చేశారు. లిఖితపూర్వకంగా వినతి పత్రాలూ అందజేశారు. ప్రధానంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించబోతున్నామని, దీనిపై మహారాష్ట్రతో ఏర్పడే వివాదం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర సహకారం అవసరమని తెలిపారు. ఇలా పలు డిమాండ్లను ప్రధానికి వివరించారు.

ఇవీ విన్నపాలు..

  • ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంటే.. గత ప్రభుత్వం 1600 మెగావాట్లను మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహకరించాలి.

  • హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు, మూసీ రివర్‌ప్రాజెక్టుకు సహకరించాలి.

  • తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల నిర్మాణానికి భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి.

  • హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్‌ ఫారెస్ట్‌ ఏరియా మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సహకరించాలి. 2022-23లోనే కేంద్రం దీని డీపీఆర్‌ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసింది. రూ.7,700 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి.

  • రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించాలి. దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీరు అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జల జీవన్‌ మిషన్‌ నిధులివ్వాలి.

  • తెలంగాణలో పెరిగిన జిల్లాలు, పోలీసు కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్‌ కేడర్‌ రివ్యూ చేయాలి. కేంద్ర హోంశాఖ 2016లో రాష్ట్రానికి 76 ఐపీఎస్‌ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను బట్టి పోలీసు అధికారుల అవసరం పెరిగింది. అత్యవసరంగా 29 ఐపీఎస్‌ పోస్టులను అదనంగా కేటాయించాల్సి ఉంది. వీలైనంత త్వరగా పోస్టులను మంజూరు చేయాలి.

  • హైదరాబాద్‌-రామగుండం, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ రహదారులపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్‌ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవాపురం రిజర్వాయర్‌ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్‌ ల్యాండ్స్‌ను రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్‌పేటలోని ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ (1038 ఎకరాల) భూములను తిరిగి అప్పగించాలి.

  • ఐఐటీ, నల్సార్‌, సెంట్రల్‌ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. అత్యున్నత విద్యా సంస్థలను అందరికీ అందుబాటులో ఉంచడానికి ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎంను నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా హైదరాబాద్‌లోనూ ఒకటి నెలకొల్పాలి. అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తాం.

  • జాతీయ ఆరోగ్య మిషన్‌ కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5259 ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్త్తోంది. 2023--24కు సంబంధించి కేంద్ర వాటాగా రావాల్సిన ఆయుష్మాన్‌ నిధులు రూ.347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలి.

Updated Date - Mar 06 , 2024 | 06:37 AM