Share News

పట్నం పోదాం చలో చలో

ABN , Publish Date - Jan 18 , 2024 | 05:10 AM

మూడు రోజుల సంక్రాంతి సంబరాలు ముగియడంతో.. పండుగ కోసం పల్లెబాట పట్టినవారంతా తిరుగుప్రయాణమయ్యారు.

పట్నం పోదాం చలో చలో

సంక్రాంతి ముగియడంతో ప్రజలు తిరిగి రాజధానికి..

చౌటుప్పల్‌ రూరల్‌, బీబీనగర్‌, చిట్యాల రూరల్‌, కేతేపల్లి, జనవరి 17: మూడు రోజుల సంక్రాంతి సంబరాలు ముగియడంతో.. పండుగ కోసం పల్లెబాట పట్టినవారంతా తిరుగుప్రయాణమయ్యారు. బంధుమిత్రులతో ఆనందంగా గడిపి.. ఆ మధురానుభూతులను మూటగట్టుకుని మళ్లీ రాజధాని బాట పట్టారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి.. ఏపీకి వెళ్లినవారు.. ఇలా అందరి దారులూ బుధవారం హైదరాబాద్‌వైపే! పిల్లాపాపలతో కార్లు, బస్సులు, ద్విచక్రహనాల్లో వెళుతున్న ప్రజలతో జాతీయ రహదారులు రద్దీగా మారాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి నెం.163, నల్లగొండ జిల్లా మీదుగా హైదరాబాద్‌-విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీగా విపరీతంగా కన్పించింది. ఫాస్టాగ్‌లు ఉన్నా కూడా వాహనాలు ముందుకు సాగడానికి కొంత సమయం పట్టింది. అదే విధంగా జాతీయ రహదారిపై ఉండే హోటళ్లు సైతం వాహనదారుల సందడితో కిటకిటలాడాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లామీదుగా హైదరాబాద్‌ వైపు దాదాపుగా 87 వేల వాహనాలు బయలుదేరి వెళ్లినట్లు జీఎంఆర్‌ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం రద్దీ సాధారణంగానే కన్పించినా.. సమయం గడిచేకొద్దీ వాహనాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేటు వద్ద 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా హైదరాబాద్‌ వైపు వాహనాలను పంపించారు. ఫాస్టాగ్‌ ఉండి స్కానింగ్‌ కాని వాహనాలను అదనపు సిబ్బందితో స్కానింగ్‌ చేసి పంపించారు. బుధవారం పంతంగి టోల్‌గేట్‌ నుంచి 65వేల వాహనాలు, బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా నుంచి 22 వేల వాహనాలు వెళ్లినట్లు జీఎంఆర్‌ సిబ్బంది తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 05:26 AM