Share News

కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం!

ABN , Publish Date - Mar 07 , 2024 | 03:39 AM

కరువు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం!

రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి

రైతులకు అండగా ఉంటాం

ఎండాకాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చర్యలు

రైతుల సమస్యలను పరిష్కరించేందుకే రైతునేస్తం

వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): కరువు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కలిసికట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఏడాదిగా సరైన వర్షపాతం లేకపోవడంతో రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని, అందుకే అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. రిజర్వాయర్ల నుంచి నీళ్లను విడుదల చేయాల్సిందిగా కరీంనగర్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల రైతులు, నాయకులు డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. రైతులందరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎండాకాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చూసేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టిన ‘రైతునేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమాన్ని సీఎం తన నివాసం నుంచి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సీజన్‌లో రైతులు ఎదుర్కొనే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారాలు సూచించేందుకు రైతునేస్తం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలని, రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. రైతులతో కలిసి భవిష్యత్తు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని, విత్తనాలు, ఎరువులు, ఏ పంట వేయాలనేది మొదలుకొని.. పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేంత వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. పంటలకు లాభసాటి ధర రావాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణ చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రైతులు కేవలం వరి, పత్తి మిర్చి పంటలకే పరిమితం కావద్దని, ఇతర పంటలు సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రస్తుతం 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నామని, భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని చెప్పారు.

ప్రతి వారం రైతునేస్తం కార్యక్రమం..

రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రతి వారం నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రభావం పెరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఫామ్‌ మెకనైజేషన్‌కు భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. డ్రిప్‌ యూనిట్లు, స్ర్పింక్లర్లు రైతులకు ఇచ్చి ప్రోత్సహించామని గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఫామ్‌ మెకనైజేషన్‌కు ఏమాత్రం నిధులు కేటాయించకపోవటంతో రైతులు నష్టపోయారని అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా పడటంతో జలాశయాల్లో నీళ్లు అడుగంటుతున్నాయని, అందరూ సమిష్టిగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కొన్ని శక్తులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కాగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. వివిధ రైతు వేదికల నుంచి ఆన్‌లైన్‌లో రైతులతో ఆయన సంభాషించారు. ేసంద్రియ సాగుకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని తెలిపారు. ేసంద్రియ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధరను పొందేలా మార్కెట్‌ అవకాశాలను అన్వేషిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Mar 07 , 2024 | 03:39 AM