Kumaram Bheem Asifabad- ఓటింగ్ సరళిపై నాయకుల ఆరా
ABN , Publish Date - May 14 , 2024 | 11:13 PM
లోక్ సభకు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితం వెలవడడమే మిగి లింది. జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో సోమవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో అటు అధికారులు, ఇటు అభ్యర్థులు, నేతలు, పోలీసు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
![Kumaram Bheem Asifabad- ఓటింగ్ సరళిపై నాయకుల ఆరా](https://media.andhrajyothy.com/media/2024/20240511/maha_copy_12270177b2.gif)
- జూన్ 4న ఫలితాల వెల్లడి
ఆసిఫాబాద్, మే 14: లోక్ సభకు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితం వెలవడడమే మిగి లింది. జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో సోమవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో అటు అధికారులు, ఇటు అభ్యర్థులు, నేతలు, పోలీసు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్స్ మొరాయించడంతో కొత్తవి అమర్చి పోలింగ్ నిర్వహించడంతో కొన్ని మండలాల్లో పోలింగ్ ఆలస్యమైంది. ఓవరాల్గా చూసినట్లయితే పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వారి తలరాతను మార్చే తీర్పు రావాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. కానీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన అనంతరం గెలుపు, ఓటములపై ప్రజలు చర్చలకు తెరలేపారు. ఎక్కడ నలుగురు కలిసినా ఎన్నికల విషయాలే చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో రచ్చబండల వద్ద కూర్చున్న జనం సైతం ఈ ఎన్నికల విషయాలే చర్చించుకుంటున్నారు. అంతే కాక గెలుపు ఓటములపై పలు సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వేర్వేరుగా ఉండడంతో ప్రజలు ఒక అంచనాకు రాలేక పోతున్నారు. ఏదీ ఏమైనా ఫలితాలు ప్రకటించే వరకు పట్టణం, గ్రామం, ఊరు, వాడ అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఫలితాలపైనే జోరుగా చర్చ జరుగుతుంది.
గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరిగా సాగింది. దీంతో ఏ పార్టీకి జిల్లాలో మెజార్టీ ఎంత వస్తుందో అనే దానిపై ఖచ్చితంగా ఒక అంచనాకు వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. కాగా అభ్యర్థుల గెలుపు ఓటములపై జోరుగా చర్చ సాగుతుంది. దీనికి తోడు జిల్లాలో గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గడంతో అయా పార్టీల నాయకులు మెజార్టీపై అంచనాకు రాలేకపోతున్నారు. ఏది ఏమైనప్పటికి జూన్ 4వ తేదీ మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడయ్యే వరకు అటు అభ్యర్థుల్లో ఇటు పార్టీ నాయకుల్లో ఉత్కంఠ కొనసాగనుంది.
ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చ..
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సోమవారం జిల్లాలోని రెండు శాసన సభ స్థానాలైన ఆసిఫాబాద్, సిర్పూర్లలో పోలింగ్ ముగిసింది. అనంతరం ఈవీఎంలను అధికారులు ఆదిలాబాద్కు తరలించారు. అయితే ఫలితాలు జూన్ 4న వెలవడనున్నాయి. పోలింగ్కు ఫలితాల వెలుబడడానికి మధ్యలో ఇంకా ఇరువై రోజుల సమయం ఉంది. దీంతో ఫలితాలపై చర్చ మొదలైంది. పోలింగ్ జరిగే సరళిని, ఓటర్ల మనోభావాలను ఆధారంగా చేసుకుని ఫలితాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా ఇదంతా పట్టణాలకే పరితం అనుకోవడానికి వీలులేకుండా పల్లెల్లో కూడా చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామాల కూడల్లలో రచ్చబండ వద్ద కూర్చునే జనం ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని చర్చించుకుంటున్నారు. .
కాగజ్నగర్: పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీల నాయకుల కార్యకర్తలను మెజార్టీపై ఆరా తీస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పోటాపోటీలుగా నిర్వహించారు. పోలింగ్ సోమవారం ముగియడంతో ఆయా పార్టీ నాయకులు కింది స్థాయి కార్యకర్తలకు ఉదయం నుంచి ఫోన్లు చేసి మెజార్టీ వివరాలు సేకరిస్తున్నారు. సోమవారం ఎన్నికల బిజీ బిజీ ఉండటంతో ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని పార్టీల నాయకులు దృష్టి సారించారు. కుమరం భీం జిల్లాలో సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ ముగిసేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు ప్రజలు ఓటు వేసేందుకు రాలేక పోయారని, దీంతో ఓటింగ్ శాతం తగ్గిందని ప్రధాన పార్టీల నాయకులు భావిస్తున్నారు. అన్ని వార్డుల నాయకులతో మంగళవారం ఉదయం నుంచి ఆయా పార్టీల నాయకులు సమావేశాలు నిర్వహించారు. ఎంత మంది ఓటేయలేక పోయారన్న విషయాలపై ఆరా తీశారు. అలాగే పార్టీకి పడిన ఓట్లు ఎంత..? ప్రత్యర్థి పార్టీకి ఎన్ని ఓట్లు పడేట్టు ఉన్నాయన్న విషయాలపై అడిగి తెలుసుకున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబు పాల్గొని ఓటింగ్ సరళిపై చర్చించారు. మండలాల్లో జరిగిన పోల్ అయిన ఓటింగ్ జాబితాను తీసుకొని చర్చించారు. మెజార్టీ వచ్చే మండలాలు ఎన్ని ఉన్నాయి..? ఎంత తగ్గింది..? ఎందుకు తగ్గిందనే కోణంలో కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనప్ప నివాసంలో జిల్లా జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా ఓటింగ్ సరళిపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఏడు మండలాల్లో ఎంత ఓటింగ్ పెరిగింది..? పార్టీకి ఎంత వచ్చే అవకాశాలున్నాయనే కోణంలో వాకాబు చేశారు. ఇక బీఆర్ఎస్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ ఎంఎల్సీ దండే విఠల్ ఉదయం నుంచి సిర్పూరు నియోజకవర్గంలో క్రియశీలక కార్యకర్తలో మంతనాలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీ, మాజీ సీఎం చేసిన అభివృద్ధితో ఎన్ని ఓట్లు పార్టీక టర్న్ అవుతాయన్న విషయంలో ఏడు మండలాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనుండడంతో ఎవరికి వారే తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెబుతున్నారు.