Share News

ఏసీబీ వలలో కేయూ ఆడిట్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌

ABN , Publish Date - Jan 06 , 2024 | 04:49 AM

కాకతీయ విశ్వవిద్యాలయం అడిట్‌ విభాగంలో లంచం తీసుకుంటున్న ఓ అధికారిని ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

ఏసీబీ వలలో కేయూ ఆడిట్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌

కాంట్రాక్టర్‌ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

హనుమకొండ క్రైం/ కేయూ క్యాంపస్‌, జనవరి 5: కాకతీయ విశ్వవిద్యాలయం అడిట్‌ విభాగంలో లంచం తీసుకుంటున్న ఓ అధికారిని ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆడిట్‌ విభాగంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సిగసారపు కిష్టయ్య ఓ పాల కాంట్రాక్టర్‌ నుంచి శుక్రవారం రూ.50వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. వరంగల్‌లోని కాశిబుగ్గకు చెందిన పెండెం రాజేందర్‌ కాకతీయ వర్సిటీ పరిధిలోని హాస్టళ్లలో పాలు, పెరుగు సరఫరా చేస్తున్నాడు. రెండేళ్లకు గానూ రూ.15లక్షల బిల్లులు రాజేందర్‌కు రావాల్సి ఉంది. దీని కోసం రాజేందర్‌ పలుమార్లు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కిష్టయ్యను కలిశాడు. బిల్లులు మంజూరు చేయాలంటే రూ.75వేలు లంచం ఇవ్వాలని కిష్టయ్య డిమాండ్‌ చేశాడు. చేసేదిలేక రాజేందర్‌ ఒకసారి రూ.15వేలు, మరోసారి రూ.10వేలు ఇచ్చాడు. ప్రతిగా కిష్టయ్య రూ.8 లక్షల చెక్కును అప్పగించాడు. మిగతా రూ.7లక్షలకు సంబంధించి రూ.50వేలు ఇవ్వాలని కిష్టయ్య ఒత్తిడి తెచ్చాడు. దీంతో రాజేందర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు రూ.50వేలతో శుక్రవారం కేయూకు వెళ్లాడు. పరిపాలనా విభాగం ఆడిట్‌ కార్యాలయంలో తెచ్చిన ఆ డబ్బును కిష్టయ్యకు అందించాడు. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు నగదును స్వాధీనం చేసుకుని కిష్టయ్యను అరెస్టు చేశారు.

Updated Date - Jan 06 , 2024 | 04:49 AM