సీఎం కాలేదనే కేటీఆర్ ఇబ్బంది పడుతున్నారు
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:53 AM
ముఖ్యమంత్రి పదవి రానందుకే కల్వకుంట్ల తారకరామారావు ఇబ్బంది పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టడం కుళ్లు బుద్ధికి నిదర్శనం
2, 3, 4 తేదీల్లో సీపీఐ జాతీయ సమితి భేటీలు: నారాయణ
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి పదవి రానందుకే కల్వకుంట్ల తారకరామారావు ఇబ్బంది పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు అసంబద్ధంగా మా ట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టడంతో వారి కుళ్ళు బుద్ధి బయటపడిందని అన్నారు. గవర్నర్ కోటాలో కోదండరామ్ ఎమ్మెల్సీగా నియమితులు కావడం పట్ల నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో సీపీఐ జాతీయ సమితి సమావేశాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశాలకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ నేతలు అమర్ కౌర్, బినయ్ విశ్వం తదితరులు హాజరవుతారని తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ వ్యవహరంపై స్పందిస్తూ.. ఓటమి భయంతో నే ‘ఇండియా కూటమి’ని బీజేపీ ప్రభుత్వం బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పదేళ్ల కాలంలో మోదీ సాధించిందేమీ లేదని, అందుకే ‘శ్రీరాముడు’ పేరుతో మళ్లీ గెలిచేందుకు ఆరాటపడుతోందని అన్నారు.