Share News

కేజ్రీవాల్‌ టార్గెట్‌గా కవిత విచారణ!

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:11 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు మరింత పెంచింది.

కేజ్రీవాల్‌ టార్గెట్‌గా కవిత విచారణ!

ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు

కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం

వాంగ్మూలాలు ఆమె ముందుంచి ప్రశ్నలు

లిక్కర్‌ స్కాంలో మేక శరణ్‌ పాత్రపై ఆరా

ఎనిమిదో రోజూ కవిత విచారణ

నిజామాబాద్‌లో ఈడీ బృందాల దర్యాప్తు?

కవితను కలిసిన కుటుంబీకులు, న్యాయవాది

న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు మరింత పెంచింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ప్రధాన కుట్రదారుగా నిరూపించేందుకు కావాల్సిన అన్నిరకాల ఆధారాల సేకరణకు కార్యాచరణను మమ్మురం చేసినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల వ్యవహారంలో కేజ్రీవాల్‌కు ఉచ్చు బిగించేందుకుగాను తమ అదుపులో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఆదివారం రోజంతా విచారించినట్లు తెలిసింది. ఎనిమిదో రోజు విచారణలో భాగంగా.. మద్యం విధానంలో లబ్ధి పొందినవారి నుంచి కేజ్రీవాల్‌ నేరుగా ముడుపులు స్వీకరించిన అంశంపై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం. రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపు విషయంలో కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా.. సౌత్‌ గ్రూప్‌ సభ్యులతో కలిసి దళారుల ద్వారా చేసిన మడుపుల చెల్లింపులపై కీలక సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలిసింది. వివిధ మార్గాల ద్వారా పంపిన ముడుపులను ఎన్నికల్లో ఆప్‌ వినియోగించిన తీరు, అందులో కవిత పాత్రపై ఆరా తీసినట్లు సమాచారం.

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో ఇండో స్పిరిట్‌కు అత్యధిక లాభాలు వచ్చేలా చూడడంతోపాటు, హోల్‌సేల్‌ వ్యాపారి లాభాల మార్జిన్‌ను 12 శాతానికి పెంచి, అందులో కొంత ముడుపులుగా స్వీకరించేందుకు వీలుగా కవిత పోషించిన పాత్రపై ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలను మరోసారి ఆమె ముందు పెట్టి విచారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సౌత్‌ గ్రూప్‌ ఆర్థిక లావాదేవీలలో కవిత ఆడపడుచు కుమారుడు మేక శరణ్‌ పోషించిన పాత్రపై ఈడీ అధికారులు మరింత లోతుగా ప్రశ్నించినట్లు తెలిసింది. కవిత నివాసంలో ఆమెను అరెస్టు చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న మేక శరణ్‌ ఫోన్‌లో గుర్తించిన సౌత్‌ గ్రూప్‌ లావాదేవీల సమాచారంపై ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శరణ్‌ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపై వారు పదే పదే ప్రశ్నించినట్లు సమాచారం. కవిత వైపు నుంచే కాకుండా.. లిక్కర్‌ వ్యాపారి సమీర్‌ మహేంద్రు వైపు నుంచి కూడా మేక శరణ్‌ పాత్రపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సమీర్‌ మహేంద్రును తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే శరణ్‌ పాత్రపై సమీర్‌ను ఒక్కడినే విచారిస్తారా? లేక ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన సౌత్‌ గ్రూప్‌లోని కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ్‌, మాగుంట శ్రీనివాసులుతో కలిపి విచారిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

నిజామాబాద్‌కు ఈడీ బృందాలు?

నిజామాబాద్‌లో కవిత వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు ఈడీ బృందాలు అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన అక్రమార్జనను కవిత నిజామాబాద్‌లో వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే నిజామాబాద్‌లో కవిత వ్యవహారాలకు సంబంధించి ఆమె అనుచరులను విచారించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. శనివారం కవిత కస్టడీ పొడగింపు కోసం రౌస్‌ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన ఆఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపైనా ఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అంశాలపై కవితను పలుమార్లు ప్రశ్నించిన అధికారులు.. ఆమె నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయామని కోర్టుకు తెలిపిన విషయం విదితమే. కాగా, కవితను ఆదివారం ఆమె కుటుంబసభ్యులు కలిశారు. ఆమె ఇద్దరు కుమారులు, భర్త అనిల్‌, ఆమె తరపు న్యాయవాది ఆదివారం సాయంత్రం ఈడీ కార్యాలయంలో కవితను కలిశారు.

Updated Date - Mar 25 , 2024 | 04:17 AM