కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయం
ABN , Publish Date - Apr 29 , 2024 | 05:01 AM
అధికార దుర్వినియోగంతో రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటూ గెలవదు: రాజగోపాల్రెడ్డి
చౌటుప్పల్ టౌన్/అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 28: అధికార దుర్వినియోగంతో రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దఅంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్లో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత తీహాడ్ జైలులో ఉన్నారన్నారు. రూ.లక్షల కోట్ల ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుందని, ఈ అవినీతిని బయటకు తీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసి అప్పుల పాల్జేశారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లో వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేసేవారన్నారు. అంత బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతికి అప్పగిస్తే పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుగా తుగ్లక్ లాగా పాలన చేశారని, కూలిపోయే ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లపాటు ప్రజా వ్యతిరేక, నియంతృత్వ పాలన సాగించిన బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని అన్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్రెడ్డిని గెలిపించుకువస్తానని సీఎం రేవంత్రెడ్డికి మాట ఇచ్చినట్లు ఆయన తెలిపారు.