Share News

కవిత బెయిల్‌ పిటిషన్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:47 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈడీ అరెస్టు చేసిన కేసులో తనకు రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని కవిత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం

కవిత బెయిల్‌ పిటిషన్‌

విచారణ 22కు వాయిదా

8 ఈడీ, సీబీఐ కేసుల్లో విచారణ ఒకేరోజు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈడీ అరెస్టు చేసిన కేసులో తనకు రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని కవిత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే.. ప్రత్యేక జడ్జి కావేరి బవేజా సెలవులో ఉండడంతో పిటిషన్‌పై విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.

రెండు బెయిల్‌ పిటిషన్లపై ఒకేరోజు విచారణ

సీబీఐ అరెస్టుకు సంబంధించి తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రౌజ్‌ అవెన్యూ కోర్టులో సోమవారమే కవిత బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ 664 పేజీలతో పిటిషన్‌ వేశారు. దీనిపై ఈనెల 20లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తర్వాత 22న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఇక, ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సైతం 22వ తేదీకే వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత బెయిల్‌ పిటిషన్లపై సోమవారమే విచారణ జరగనుంది. తిహాడ్‌ జైల్లో ఉన్న కవిత జ్యుడిషియల్‌ కస్టడీ ఈనెల 23తో ముగియనుంది.

Updated Date - Apr 17 , 2024 | 03:47 AM