Share News

తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టినోళ్లు నీతులు చెప్పడమా?

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:06 AM

‘పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను అక్రమంగా ఏపీకి దోచిపెట్టారు. అలాంటి నేతలు కూడా ఇప్పుడు నీటి పంపిణీపై మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది’ అని బీజేపీ జాతీయ ప్రధాన

తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టినోళ్లు నీతులు చెప్పడమా?

కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

సీఎం రేవంత్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు: రఘునందన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ‘పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను అక్రమంగా ఏపీకి దోచిపెట్టారు. అలాంటి నేతలు కూడా ఇప్పుడు నీటి పంపిణీపై మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, మాజీ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. జనం నవ్వుకుంటారనే సోయి కూడా లేకుండా అపర మేధావి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా జలాలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ నేతలకు లేదని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయని, మొన్న కాళేశ్వరం.. తాజాగా పెద్దపల్లి ఓడేడు బ్రిడ్జి ఇందుకు నిదర్శనం అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ చేసిన అరాచకాలు, మోసాల పట్ల ప్రజలు విసిగిపోయారని,. ఆ పార్టీ నేతలు ఎంత మొసలి కన్నీరు కార్చినా, పొర్లు దండాలు పెట్టినా, బస్‌ యాత్ర కాదు కదా.. మోకాళ్ల యాత్ర చేసినా జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. అందుకే ఈనెల 27న బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా నిర్వహించడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు తనపైన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆరు గ్యారెంటీలు, ప్రభుత్వ విధానాలపైన తాను ప్రశ్నిస్తుంటే.. వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కాగా, సీఎం రేవంత్‌ రెడ్డి మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎం. రఘునందన్‌రావు విమర్శించారు. గడిలో నుంచి దొర వచ్చి పోటీ చేస్తున్నారని తననుద్దేశించి వ్యాఖ్యానించిన రేవంత్‌.. తమ ఊరిలోని ఏ గడిలో పుట్టానో చెబితే దానిని ఆయన పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తా అని ప్రకటించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ పదేళ్లలో మెదక్‌కు ఏమీ చేశారని రేవంత్‌ ప్రశ్నించారని, ఆయన నిలుచుండి మాట్లాడిన రోడ్డు కూడా కేంద్రం నిధులతో వేయించిందేనని చెప్పారు.

Updated Date - Apr 24 , 2024 | 05:06 AM