Share News

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను..ఆ ప్రాంతాల్లో కట్టాలని చెప్పిందెవరు?

ABN , Publish Date - Mar 24 , 2024 | 06:01 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఆయా ప్రాంతాల్లో కట్టాలని చెప్పిందెవరని జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ..

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను..ఆ ప్రాంతాల్లో  కట్టాలని చెప్పిందెవరు?

బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా?..

డీపీఆర్‌లపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా?

సీడీవో, క్వాలిటీ కంట్రోల్‌ సలహాలను పాటించారా?

బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉంటే ఏం చేయాలి?

రాష్ట్ర నీటి పారుదల శాఖకు నిపుణుల కమిటీ ప్రశ్నలు

ఈ నెల 26 కల్లా ప్రశ్నలకు వివరణ ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఆయా ప్రాంతాల్లో కట్టాలని చెప్పిందెవరని జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ.. రాష్ట్ర నీటిపారుదల శాఖను ప్రశ్నించింది. 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలిచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే కాలక్రమేణా తీవ్రత పెరిగి మూడు బ్యారేజీలకు నష్టం పెరిగిందా? బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్‌ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్‌వాల్‌, లాంచింగ్‌ అప్రాన్‌ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయి? వాటికి నష్టం ఎందుకు జరిగింది? అని కమిటీ ప్రశ్నించింది. ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటించి రాష్ట్ర నీటిపారుదల శాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ కమిటీ.. తిరిగి వెళ్లేటప్పుడు ఈ ప్రశ్నావళిని అందించింది. వీటికి సమాధానాలను వెంటనే సీల్డ్‌కవర్‌లో అందజేయాలని కోరింది. అయితే మంగళవారం కల్లా అందజేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు నివేదించగా.. సమ్మతి తెలిపింది. కాగా, బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలియజేస్తూ సమగ్ర నివేదికను అధికారులు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో.. ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు నీటిపారుదల శాఖ అధికారులు తీసుకున్న చర్యలేంటి? నిర్మాణ సంస్థలకు జారీ చేసిన ఆదేశాలేంటి? నిర్మాణ సంస్థలు తక్షణమే మరమ్మతులు చేపట్టాయా? వంటి వివరాలు ఈ నివేదికలో ఉండాలి. ఒకవేళ ముందుజాగ్రత్త చర్యలేమైనా తీసుకుంటే తెలపాలి. చర్యలు తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీల్లో ఏదైనా అసాధారణ పరివర్తన గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు (డేటా ఇంటర్‌ప్రిటేషన్‌), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం (అధికారి) ఏది? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్‌ అనుసరిస్తున్నారు? అని అయ్యర్‌ కమిటీ ప్రశ్నించింది.

జరిగిన తప్పులేంటి? కారకులెవరు?

రాష్ట్ర నీటిపారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయాన్ని అర్థం చేసుకోవడంలో భాగంగా శాఖ మౌలిక స్వరూపంపై పలు కీలక ప్రశ్నలను అయ్యర్‌ కమిటీ సంధించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, లోటుపాట్లను గుర్తించి.. బాధ్యులను ధ్రువీకరించడానికి ఈ సమాచారం కీలకం కానుంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్‌సీల నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల స్థాయి వరకు ఉన్న అధికారాల క్రమాన్ని తెలియజేసేలా శాఖ ఆర్గనైజేషన్‌ చార్ట్‌ను సమర్పించాలని కోరింది. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) చీఫ్‌ ఇంజనీర్‌, రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌, క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఇన్‌స్పెక్షన్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌తోపాటు ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం)లు తమ పైఅధికారిగా ఎవరికి రిపోర్ట్‌ చేస్తారని ప్రశ్నించింది. సీడీవో, క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఇన్‌స్పెక్షన్‌ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్‌స్ట్రక్షన్‌ విభాగం కట్టుబడి ఉంటుందా? అని అదిగింది. బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం(ఆపరేషన్‌ షెడ్యూలింగ్‌)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీవో/ తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌(టీఎ్‌సఈఆర్‌ఎల్‌)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా? అని ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీకి) సమర్పించడానికి ముందు దాని రూపకల్పన, సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దీనికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్‌ ఉన్నాయో తెలపాలి? అని పేర్కొంది.

బ్యారేజీలు నీటి మళ్లింపునకా? నిల్వకా?

మూడు బ్యారేజీల ప్లానింగ్‌, డిజైన్లు, నిర్మాణాన్ని.. నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అన్న కీలక ప్రశ్నను అయ్యర్‌ కమిటీ సంధించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయులను నెలవారీగా తెలియజేసే నివేదికను సమర్పించాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. ప్రతి బ్యారేజీకి సంబంధించిన నిర్మాణం ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని కోరింది. డీపీఆర్‌ల ప్రకారం మూడు బ్యారేజీల విశిష్టతలను తెలపాలని పేర్కొంది. నిర్మాణంలో వీటిని పాటించారా? ఏమైనా ఉల్లంఘనలు జరిగాయా? అని అడిగింది. బ్యారేజీల నిర్మాణానికి ముఖ్య లక్ష్యాలేంటి? కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు మూడు బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవోలను సమర్పించాలని సూచించింది. డీపీఆర్‌ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్‌, ఇతర డైరెక్టరేట్‌లు అభ్యంతరాలు ఏమైనా తెలిపారా? సీఎ్‌సఎంఆర్‌ఎస్‌, జీఎ్‌సఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/అబ్జర్వేషన్లు ఏంటి? నిర్మాణానికి ముందు అన్ని కామెంట్లు/అబ్జర్వేషన్లను పరిష్కరించారా? కామెంట్లు/అబ్జర్వేషన్లు, వాటిపై తీసుకున్న చర్యలను పట్టిక రూపంలో సమర్పించాలని అయ్యర్‌ కమిటీ కోరింది.

నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి?

నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్‌ను రూపొందించింది ఎవరని అయ్యర్‌ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలతోపాటు తుది ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలేంటి? బ్యారేజీల కింద భూగర్భంలో నీటి ప్రవాహంపై చేసిన అంచనాలేంటి? పంపింగ్‌ ఏర్పాట్లను డిజైన్‌ చేసే సమయంలో ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారా? అని అయ్యర్‌ కమిటీ అడిగింది. లోపాలు బహిర్గతమైన తర్వాత మూడు బ్యారేజీలకు నిర్వహించిన సబ్‌ సర్ఫేస్‌ జియోలాజికల్‌/జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ నివేదికలు సమర్పించాలని అయ్యర్‌ కమిటీ కోరింది. ఈ పరీక్షలు నిర్వహిస్తే సరిపోతుందా? సర్వేలు, ఇన్వెస్టిగేషన్ల పరిధి.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉన్నాయా? లేక లోటు ఉందా? అని ప్రశ్నించింది. మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్‌, పియర్లు కుంగిపోవడానికి కారణాలేంటి? మూడు బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి బుంగలు ఏర్పడి సీపేజీ జరగడానికి కారణాలేంటి? వచ్చే వానాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి? బ్యారేజీలను రక్షించడానికి తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చర్యలేంటి? అని పునరుద్ధరణ పనులపై నీటిపారుదల శాఖ అభిప్రాయాన్ని అయ్యర్‌ కమిటీ కోరింది.

Updated Date - Mar 24 , 2024 | 06:01 AM