చేవెళ్ల నుంచి కాసానివరంగల్ నుంచి కడియం కావ్య
ABN , Publish Date - Mar 14 , 2024 | 05:27 AM
నాలుగు పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చల అనంతరం వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్లో గాలి అనిల్కుమార్
4 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు’
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): నాలుగు పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చల అనంతరం వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్లను ప్రకటించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 50శాతానికిపైగా బీసీలే ఉండడం, గతంలో ఆర్మూర్, బాన్సువాడ ఎమ్మెల్యేగా పని చేసి ఉండడం, జిల్లాలో అందరికీ తెలిసిన వ్యక్తిగా పేరుండడంతో బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మరోవైపు, జహీరాబాద్ సిటింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరడంతో ఆ స్థానానికి పఠాన్చెరువుకు చెందిన సీనియర్ నేత అనిల్ కుమార్ను ఎంపిక చేశారు. పార్టీలో చాలా కాలంగా పని చేస్తుండడం, బీసీ అభ్యర్థి కావడం కలిసొస్తుందన్న అంచనాతో ఆయన ఎంపిక జరిగింది. తాజా ప్రకటనతో మొత్తం తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది.