చకచకా ఉద్యోగ పరీక్షల ఫలితాలు
ABN , Publish Date - Feb 12 , 2024 | 03:12 AM
ప్పటికే నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాలను వరుసగా వెల్లడించాలని టీఎ్సపీఎస్సీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఏడాదిలోనే సుమారు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం
![చకచకా ఉద్యోగ పరీక్షల ఫలితాలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/1res_0d226c62c6.jpg)
ఇప్పటికే గ్రూప్-4 రిజల్ట్స్ విడుదల
వారంలోనే మరో 3 పరీక్షల ఫలితాలు
టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారుల నిర్ణయం
సుప్రీంలో కేసు కొలిక్కి వస్తే గ్రూప్-1
నోటిఫికేషన్.. 19న విచారణ
అప్పీల్ విత్డ్రాకు సర్కారు పిటిషన్
హైదరాబాద్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఇప్పటికే నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాలను వరుసగా వెల్లడించాలని టీఎ్సపీఎస్సీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఏడాదిలోనే సుమారు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా పరీక్షలు పూర్తయిన పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడించి, త్వరితగతిన భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎ్సపీఎస్సీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం 8,180 గ్రూపు-4 పోస్టులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను వెల్లడించింది. త్వరలోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు రూపొందించి, పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది. అలాగే, ఇతర పోస్టుల భర్తీ విషయంలోనూ చర్యలు తీసుకోవాలని టీఎ్సపీఎస్సీ భావిస్తోంది. వీటిలో ముఖ్యంగా లైబ్రేరియన్లు (71), డ్రగ్ఇన్స్పెక్టర్లు(18), జూనియర్ లెక్చరర్లు(1392), అసిస్టెంట్ ఇంజనీర్లు(833), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు(185), ఉద్యాన అధికారులు(22), టౌన్ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల(175)తోపాటు అకౌంట్స్ ఆఫీసర్స్, పాలిటెక్నికల్ లెక్చరర్లు, భూగర్భ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఏఎంవీఐ పోస్టులు ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షలకు సంబంధించిన తుది కీ విడుదల చేశారు. వారంలోగా ఈ పోస్టుల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
సుప్రీంలో విత్డ్రా తర్వాత గ్రూప్-1
గ్రూపు-1 పోస్టుల భర్తీ కోసం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం టీఎ్సపీఎస్సీ ఇప్పటికే పూర్తి చేయగా.. సుప్రీంకోర్టులో కేసు కొంత వరకు అడ్డంకిగా ఉంది. పేపర్ లీకేజీతో మొదటి సారి గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దవ్వగా.. రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో అక్రమాలకు అవకాశాలున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ఓఎంఆర్ షీట్ల సంఖ్యలోనూ తేడాలున్నాయని కోర్టుకు విన్నవించారు. హైకోర్టు ఆ పరీక్షను రద్దుచేయడంతో.. గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లింది. అప్పట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 503 పోస్టులతో.. మరో 60 పోస్టులను కలిపి కొత్త లేదా రివైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆ అప్పీల్ అడ్డంకిగా ఉంది. ఈనెల 19న సుప్రీంకోర్టులో అప్పీల్పై విచారణ జరగనుంది. కొత్త సర్కారు ఇప్పటికే ఆ అప్పీల్ను విత్డ్రా చేసుకుంటామని పేర్కొంటూ పిటిషన్ వేసింది. అంటే.. ఈనెల 19న పిటిషన్ విత్డ్రాకు కోర్టు అంగీకరిస్తే.. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎ్సపీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మెగా డీఎస్సీకి చకచక..
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పోస్టులకు మరో 6 వేల పోస్టులను జత చేసి, మెగా డీఎస్సీ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే వారంలోనే ఈ నోటి ఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.