ఆత్మహత్యకు కారణమైన నలుగురికి జైలు
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:02 AM
వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన అత్తింటికి చెందిన నలుగురికి మూడేళ్ల జైలు, రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ భువనగిరి కోర్టు తీర్పును వెలువరించింది.
ఆత్మహత్యకు కారణమైన నలుగురికి జైలు
వలిగొండ, మార్చి 28: వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన అత్తింటికి చెందిన నలుగురికి మూడేళ్ల జైలు, రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ భువనగిరి కోర్టు తీర్పును వెలువరించింది. గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ ఎస్ఐ మహేందర్లాల్ తెలిపిన వివరాల ప్రకారం.... వలిగొండ మండలం చిత్తాపురం గ్రామానికి చెందిన డింగరి శేషాచార్యులు, శ్రీదేవిల కుమార్తె రోజాతో యాదాద్రి దేవస్థానం పూర్వ ప్రధానాచార్యులు కారంపూ డి నర్సింహాచార్యుల కుమారుడు ప్రసాదాచార్యులతో 2015లో వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. వివాహం జరిగిన ఆరు నెలల నుంచి ప్రసాదాచార్యులపై అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. 2018 మార్చి 25న రోజా ఎవరికీ చెప్పకుండా తల్లిగారిల్లైన చిత్తాపురం గ్రామానికి వచ్చింది. భర్త ప్రసాదాచార్యులు ఆమెను వెతుక్కుంటూ రోజా వద్దకు వెళ్లాడు. అత్త, మామ, బావమరిది, భార్య వేధించారు. నీకు ఏం చేతకాదు, ఉద్యోగం లేదని, బతికున్నా దండగేనని, చావరాదురా అంటూ మానసికంగా క్షోభకు గురిచేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన ప్రసాదాచార్యులు అత్తగారింటిలో ఉన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ మంటలను ఆర్పడానికి ఎవరూ ముందుకు రాకపోగా ఇంకా పెట్రో ల్ కావాలా అని హేళన చేశారు. అతని పరిస్థితిని గమనించిన గ్రామస్థులు చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అదే రోజు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2018 మార్చి 28వ తేదీన ప్రసాదాచార్యులు మృతి చెందాడు. అతడి తండ్రి కారంపూడి నర్సింహాచార్యులు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ ఇద్రీస్ అలీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం పోలీసులు తమ సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించి నేరం రుజువు కావడంతో మామ డింగరి శేషాచార్యులు, అత్త డింగరి శ్రీదేవి, బావమరిది డింగరి ఫణికుమార్, భార్య కారంపూడి రోజాలకు భువనగిరి అడిషనల్ అసిస్టెంట్ సెషన జడ్జి మూడేళ్ల జైలు, ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా ను విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్ఐ తెలిపారు.