భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకం
ABN , Publish Date - May 27 , 2024 | 10:40 PM
భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి అన్నారు.
![భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకం](https://media.andhrajyothy.com/media/2024/20240511/27_aml_17_7733bad846.jpg)
చినజీయర్ స్వామి
ఆమనగల్లు, మే 27: భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. సంస్కారం, జ్ఞాన సంపద ద్వారా ప్రపంచంలో భారతీయులు గౌరవాన్ని పొందుతున్నారని ఆయన అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ విఠాయిపల్లి బీఎన్ఆర్ గార్డెన్లో సోమవారం శృతిలయ కల్చరల్ అకాడమి, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమాన్ని చిన జీయర్ స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్కార వంతులు జీవితంలో అద్భుతంగా రాణిస్తారని, అది విద్యద్వారా ప్రాపిస్తుందన్నారు. విద్యార్థులు ఏకాగ్రత, క్రమశిక్షణతో ముందుకు సాగి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. అభ్యాసం, ఆచరణతో ముందుకు సాగే వారు జీవితంలో ఉన్నతంగా రాణిస్తారన్నారు. విద్యద్వారా విద్యార్థులను సంస్కార వంతులుగా తీర్చి దిద్దితే అద్భుతమైన తరాన్ని సమాజానికి అందించిన వారమవుతామని చిన జీయర్ స్వామి అన్నారు. ఖమ్మం జిల్లా మణుగూరులో ఈ నెల 30న 150 జంటలకు ప్రాచీన సంస్కార పద్ధతిలో సామూహిక వివాహాల కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విధ్య అందుతుందని, దేశంలో ఉన్నతంగా రాణించిన వారంతా ఈ పాఠశాలల్లో చదివిన వారేనని చినజీయర్ స్వామి అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శృతిలయ కల్చరల్ అకాడమి చైర్మన్ దార్ల చిత్తరంజన్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి , మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి మాధవ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భట్టు నర్సిరెడ్డి, ఐక్యత పౌండేషన్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి,ప్రముఖ సంఘ సేవకుడు పాపిశెట్టి రాము ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.