యూట్యూబ్, గూగుల్కు హైకోర్టు నోటీసులు
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:08 AM
ఒకరికి పరువునష్టం కలిగించేలా ఉన్న సమాచారం(కంటెంట్)ను వెంటనే తొలగించాలని ఆదేశిస్తూ యూట్యూబ్, గూగుల్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్

హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఒకరికి పరువునష్టం కలిగించేలా ఉన్న సమాచారం(కంటెంట్)ను వెంటనే తొలగించాలని ఆదేశిస్తూ యూట్యూబ్, గూగుల్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ ఇటీవల దాఖలు చేసిన ఓ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. తన కుమార్తె వివాహం అంశంలో తమ పరువుకు నష్టం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో ఉన్న సమాచారాన్ని తొలగించే విధంగా యూట్యూబ్, గూగుల్ను ఆదేశించాలని కోరుతూ రజత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె వివాహం జరిపించడంలో అక్రమాలు, అవినీతి జరిగాయంటూ ‘ది న్యూస్ మినిట్ - టీఎన్ఎం’ వెబ్ మ్యాగజైన్ తమ పరువునష్టం కలిగించే కంటెంట్ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుందని పేర్కొన్నారు. ఆ కంటెంట్ను వినియోగదారులు వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్న యూట్యూబ్, గూగుల్పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్.. డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ - 2021 ప్రకారం చర్యలు తీసుకునేలా కేంద్ర ఐటీశాఖ మార్గదర్శకాల అమలుకు ఏర్పాటు చేసిన ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ ఛైర్మన్ను ఆదేశించాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న జస్టిస్ సూరేపల్లి నంద ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం, ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ ఛైర్మన్, యూట్యూబ్, గూగుల్కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం మినహా ఇతర ప్రతివాదులకు పిటిషనర్ వ్యక్తిగతంగా నోటీసులు పంపేందుకు అనుమతించింది.