Share News

నేడు వడగాలులు.. రేపు వర్షాలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 04:15 AM

మండే ఎండలు, ఉక్కబోత, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం కాస్త ‘చల్లటి’ కబురు చెప్పింది. రాగల రెండు రోజుల్లో ఎండలు తగ్గుతాయని, ఆకాశం మేఘావృతం అవుతుందని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో

నేడు వడగాలులు.. రేపు వర్షాలు

రెండు రోజుల పాటు తగ్గనున్న ఎండలు

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

40-43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు

రేపు ఉరుములతో కూడిన వానలు

రెండ్రోజుల పాటు తగ్గనున్న ఎండలు

రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందుల్లేవు

సందీప్‌ సుల్తానియా

హైదరాబాద్‌, గజ్వేల్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): మండే ఎండలు, ఉక్కబోత, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం కాస్త ‘చల్లటి’ కబురు చెప్పింది. రాగల రెండు రోజుల్లో ఎండలు తగ్గుతాయని, ఆకాశం మేఘావృతం అవుతుందని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. శనివారం మాత్రం ఖమ్మం, నల్గగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట్‌, గద్వాల జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా శుక్రవారం ఎండ తీవ్రత గట్టిగానే కనిపించింది. మూడు జిల్లాలు మినహా అన్నిచోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు 40-43.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా కోల్వాయి, సిరిసిల్ల జిల్లా మార్తాన్‌పేట, నల్లగొండ జిల్లా మాడుగులపల్లి, గూడూరు, సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో 43.5 డిగ్రీలు, ములుగు జిల్లా ధర్మవరం, భద్రాద్రి జిల్లా కలెక్టరేట్‌, జనగాంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు లేవని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా అక్కారంలోని 40ఎంఎల్‌ పంప్‌హౌజ్‌, కుకునూరుపల్లి మండలం తిప్పారంలోని రా వాటర్‌ పంప్‌హౌజ్‌, మంగోల్‌లో 540 ఎంఎల్‌డీ డబ్ల్యూటీపీ, కొండపాక మండల కేంద్రంలోని ఇంటర్మీడియేటరీ హెచ్‌ఎండ బ్ల్యూఎ్‌సఎస్‌ పంప్‌హౌజ్‌లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి రిజర్వాయర్‌పై నిఘా ఉంచామని, గ్రామాల్లో నీటి సరఫరాపై ప్రతి రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. గత నెలలో చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో గ్రామాల్లో నీటి సరఫరా విభాగాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మరమ్మతులు చేశామని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. జూన్‌, జూలై వరకు తాగునీటి కొరత లేకుండా పటిష్ఠ ప్రణాళిక రచించామన్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేలా కలెక్టర్ల వద్ద ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Updated Date - Apr 06 , 2024 | 04:15 AM