TS News: గృహజ్యోతికి శ్రీకారం.. తెలంగాణలో ఉచితంగా విద్యుత్ పొందాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే
ABN , First Publish Date - 2024-02-06T03:59:41+05:30 IST
ఉచిత విద్యుత్తు కావాలంటూ ప్రజా పాలనలో దరఖాస్తు సమర్పించారా!? రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డు, యునీక్ సర్వీస్ కనెక్షన్ (యూఎస్సీ) నంబర్లు పొందుపరిచారా..? గత (2022-23) ఆర్థిక సంవత్సరం 12 నెలల కాలంలో సగటున నెలకు 200 యూనిట్లలోపు
200 యూనిట్లలోపు విద్యుత్తు ఇక ఫ్రీ
ఫిబ్రవరి నుంచే అమలు.. మార్చి బిల్లు జీరో
ఒక కుటుంబానికి ఒక కనెక్షన్కే అమలు
2022-23లో 2,181 యూనిట్లలోపు ఉండాలి
రేషన్ కార్డుకు ఆధార్ లింక్ అయి ఉండాలి
తొలి విడతలో 34,59,585 మందికి అమలు
ఏటా సర్కారుపై రూ.4,164 కోట్ల భారం
హైదరాబాద్, ఫిబ్రవ రి 5 (ఆంధ్రజ్యోతి): ఉచిత విద్యుత్తు కావాలంటూ ప్రజా పాలనలో దరఖాస్తు సమర్పించారా!? రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డు, యునీక్ సర్వీస్ కనెక్షన్ (యూఎస్సీ) నంబర్లు పొందుపరిచారా..? గత (2022-23) ఆర్థిక సంవత్సరం 12 నెలల కాలంలో సగటున నెలకు 200 యూనిట్లలోపు కరెంట్ వినియోగించారా..? అయితే, ఈనెల నుంచే మీకు ఉచిత విద్యుత్తు పథకం (గృహజ్యోతి) అమల్లోకి వచ్చింది. వచ్చే నెల నుంచి మీరు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి నెలలో వినియోగించిన కరెంటుకు మార్చి తొలి వారంలో రీడింగ్ తీసి బిల్లులు జారీ చేస్తారు కదా! గృహజ్యోతి పథకానికి అర్హులు ఎవరూ అప్పుడు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి వారికి జీరో బిల్లు జారీ చేస్తారు. కాకపోతే, ఉచిత విద్యుత్తు పొందే వినియోగదారులంతా తప్పనిసరిగా బకాయిలన్నీ చెల్లించేయాలి. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు హామీలను అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గృహజ్యోతి పథకం ఒకటి. దీని కింద 200 యూనిట్లలోపు వినియోగదారులకు కరెంట్ను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీల అమలుకు ఇటీవల దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. వివిధ పథకాల అమలుకు 1,09,01,255 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రేషన్ కార్డు/ ఆధార్ కార్డులు కలిగిన వారి దరఖాస్తులు 64,57,891. వారిలోనూ గృహవిద్యుత్తు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నవారు 34,59,585 మంది ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పథకం అమలుకు సర్కారు ఆమోద ముద్ర వేసింది. పథకం అమలుకు ఏటా రూ.4,164 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మరోవైపు, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకూ ఇప్పటికే ఉచిత విద్యుత్తును అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, వారిని కూడా గృహజ్యోతి పథకంలో కలిపేస్తారు. అంటే, వారికి కూడా ఇకనుంచి 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. ఇక, వీరికి సంబంధించి రూ.222.60 కోట్ల బకాయిలు ఉండగా.. వాటిని ఏకకాలంలో డిస్కమ్లకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే నా.. ప్రతి నెల 20లోపు గృహజ్యోతి వినియోగదారుల వివరాలను డిస్కమ్లు ప్రభుత్వానికి అందించాలి. సంబంధిత చెల్లింపులను ఆ తదుపరి నెల ప్రభుత్వం చేస్తుంది.
పథకం అమలుకు మార్గదర్శకాలు ఇలా..
200 యూనిట్లలోపు వినియోగించే గృహ విద్యుత్తు వినియోగదారులు అర్హులు.
ఒక కుటుంబంలో ఒక్క కనెక్షన్కే పథకం అమలు
రేషన్ కార్డుకు ఆధార్ కార్డును తప్పనిసరిగా అనుసంధానం(లింక్) చేసుకుని ఉండాలి.
ప్రజా పాలన దరఖాస్తులో యునీక్ సర్వీస్ కనెక్షన్ (యూఎస్సీ) నంబర్ను పొందుపరిచి ఉండాలి.
డిస్కమ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కనెక్షన్పై పేరు మార్పిడి చేయరాదు. ఏ వినియోగదారుడి పేరు ఉంటుందో అతడి పేరుతోనే బిల్లు జారీ అవుతుంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగం ఆధారంగా అర్హులను నిర్ణయిస్తారు. అప్పట్లో వార్షిక వినియోగం 2160 యూనిట్లు ఉందని అనుకుందాం. దానికి 10 శాతం అదనంగా కలుపుతారు. అప్పుడు వార్షిక వినియోగం 2,376 యూనిట్లు అవుతుంది. దానిని 12తో భాగించి నెల సగటు తీస్తారు. ఇలా చేసినప్పుడు నెలకు సగటున 198 యూనిట్లు వస్తుంది. వారికి ఉచిత విద్యుత్తును అమలు చేస్తారు. అంటే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2,181 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించినవారే ఇప్పుడు ఈ పథకానికి అర్హులు అవుతారు. దీనికితోడు, బిల్లు జారీ సమయంలో కూడా వారు ఆ నెలకు 200లోపు విద్యుత్తును వినియోగించి ఉండాలి. పథకంలో చేరిన తర్వాత బకాయిలు చెల్లించకపోతే గృహజ్యోతిని అమలు చేయరు.
ఈనెల 15లోగా వివరాలన్నీ సేకరించాలి
రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగిస్తున్న గృహజ్యోతి లబ్ధిదారుల నుంచి ఆధార్ కార్డుతోపాటు రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డులు) వివరాల సేకరణ ప్రక్రియను ఈనెల 15లోగా పూర్తి చేయాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అధికారులను ఆదేశించారు. పథకం అమలుపై సోమవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తులను పరిశీలించడంతోపాటు వారి ఆధార్, ఆహార భద్రత కార్డులను సేకరించాలని నిర్దేశించారు. ప్రతి కనెక్షన్కు ఫోన్ నంబర్ను నవీకరించాలని చెప్పారు. యజమాని పేరును కనెక్షన్ నుంచి తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వివరాల సేకరణ ఐచ్ఛికమేనని, 200 యూనిట్లలోపు కరెంట్ వినియోగించే వారు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టకపోయినా... వారి ఆధార్, ఆహార భద్రత కార్డుల వివరాలు తీసుకోవాలని సూచించారు.